వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ కు పలు కీలక నిర్ణయాల విషయంలో ఏపి హైకోర్టు నుండి షాక్ లు తగలడం పరిపాటిగా మారింది. హైకోర్టుకు వెళుతున్న అనేక అంశాలలో ఒకటి రెండు మినహా దాదాపు అత్యధిక విషయాల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. నేడు తాజాగా రాజమహేంద్రవరం వైశ్వ సేవా సదన్ భూములను ఇళ్ల పట్టాలుగా ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది.
ఏపి హైకోర్టులో శుక్రవారం రాజమహేంద్రవరం వైశ్య సేవా సదన్ భూములను ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి తీసుకున్న నిర్ణయంపై విచారణ జరిగింది. 1922లో తెలుగు, సంస్కృతం అభివృద్ధి, వైశ్య పేద మహిళల సహాయం చేయడం కోసం ఈ వైశ్య సదన్ ఏర్పడినట్లు పిటిషనర్ తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ తరపున వాదనలు విన్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని వైశ్యసదన్ కు నోటీసులు జారీ చేస్తూ కేసు విచారణను అక్టోబర్ నెలకు వాయిదా వేసింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ వైశ్య సదన్ కు దాదాపు 500 ఎకరాల భూముల్లో అనేక భవనాలను, కాలేజీలను, ఆలయాలు ఇవన్నీ ఏర్పాటు చేశారని చెప్పారు. వీటిపై వచ్చే ఆదాయంతోనే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సేవా సదన్ కు సంబంధించిన 32 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టగా మార్చి 16 న దేవాదాయ శాఖ కమిషనర్ ఈ భూములను తీసుకోవడానికి వీలు లేదని, హైకోర్టు తీసుకోవద్దని చెప్పిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారని తెలిపారు. ఈ వివరాలు ఇచ్చినా ప్రభుత్వం గానీ, అధికారులు గానీ పట్టించుకోకుండా ముందుకే వెళుతున్నారని ఈ నేపథ్యంలో ఒ ప్రముఖుడు పిల్ దాఖు చేయగా నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కి విచారణకు వచ్చిందన్నారు. హైకోర్టు తమ వాదనలు అన్నీ విని ప్రభుత్వం నిర్ణయంపై స్టే ఇచ్చిందని తెలిపారు.
ఇటీవలే ఒకే రోజు హైకోర్టులో ఆరేడు కీలక అంశాలపై హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులు అనాలోచితంగా, రాబోయే న్యాయపరమైన చిక్కులను పరిశీలించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి ఏర్పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.