(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఈ రోజు తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధ్యక్షతన హైపవర్ కమిటీ చివరి సమావేశం జరుగనుంది. ఇప్పటికే హైపవర్ కమిటీ మూడు సమావేశాలను నిర్వహించి రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జిఎన్ రావు కమిటీ, బిసిజి నివేదికలపై చర్చించింది. ఈ రోజు జరిగే చివరి భేటీలో మూడు రాజధానులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హైపవర్ కమిటీ సభ్యులు తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.ఇప్పటి వరకూ కమిటీలో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వివరించనున్నారు.
హైపర్ కమిటీ సూచనల మేరకు సిఆర్డిఎ అధికారులు అమరావతి ప్రాంత రైతుల నుండి సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు వేల మందికి పైగా రైతులు సూచనలు, సలహాలు అందించినట్లు తెలుస్తోంది. నేటి సమావేశంలో రైతుల సూచనలు, సలహాలను పరిశీలించనున్నారు.
మూడు సార్ల జరిగిన సమావేశాల్లో హైపవర్ కమిటీ అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణకు మొగ్గు చూపింది. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలు, సచివాలయ ఉద్యోగుల తరలింపు, సిఆర్డిఎ రద్దుతో పాటు ఇతర అంశాలపై హైపవర్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది.
హైపవర్ కమిటీ తుది నివేదికను సోమవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్కు అందించే అవకాశం ఉంది. అనంతరం జరిగే మంత్రివర్గ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికపైనే చర్చించి ఆమోదించనున్నారు.