(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్, కార్యదర్శి మధ్య జరుగుతున్న వ్యవహారం చివరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరింది. సిఆర్డిఏ రద్దు, వికేంద్రేకరణ బిల్లులకు సంబంధించి సెలెక్ట్ కమిటీ వేయాలన్న చైర్మన్ షరీఫ్ ఆదేశాలను మండలి కార్యదర్శి అమలు చేయకుండా రెండు పర్యాయాలు దస్త్రాన్ని తిరిగి పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైర్మన్ షరీఫ్ మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. శాసనమండలి కార్యదర్శిపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లుల రద్దు అంశంలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై బులెటెన్ విడుదల చేయాలన్న తన ఆదేశాలను మండలి కార్యదర్శి రెండుసార్లు తిరస్కరించడంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు. నాలుగు పేజీల వినతి పత్రాన్ని ఆయనకు అందించారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్ కమిటీ నియమించే అంశంలో జరిగిన వ్యవహారాన్నే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. రూలింగ్ అమలు చేయకుండా కార్యదర్శి జాప్యం చేయడంపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. విశిష్ఠ అధికారంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నాననీ, ఛైర్మన్ నిర్ణయాన్ని కార్యదర్శి వ్యతిరేకించడం శాసనమండలి చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదని షరీఫ్ చెప్పారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై ఇప్పటికే చాలా ఆలస్యం చేశారనీ, ఇకనైనా తన ఆదేశాలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలనీ గవర్నర్ కు సమర్పించిన వినతిలో షరీఫ్ కోరారు.