(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. రూల్ 71పై చైర్మన్ షరీఫ్ రూలింగ్ను పునః సమీక్షించాలని మంత్రులు పట్టుపట్టారు. 14మంది మంత్రులు చైర్మన్ సీటు చుట్టుముట్టారు. ఈ విధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం నడవదని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. బుగ్గన వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మంత్రుల తీరుతో సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. షేమ్ షేమ్ అంటూ టిడిపి సభ్యులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో శాసనమండలి పది నిమిషాలు వాయిదా పడింది.
అంతకు ముందు శాసనమండలి చైర్మన్ చాంబర్లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. బిల్లుపై చర్చ ప్రారంభించాలని ప్రభుత్వం కోరింది. అందుకు టిడిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. రూల్ 71 అనుమతించడంతో బిల్లుపై ఎలా చర్చ పెడతారని టిడిపి సభ్యులు ప్రశ్నించారు. ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 71 కింద చర్చ ప్రారంభిస్తామని చైర్మన్ షరీఫ్ రూలింగ్ ఇచ్చారు. మండలి చైర్మన్ తీరుపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బిల్లుకు ప్రాధాన్యం ఇవ్వాలనీ, చైర్మన్ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయకూడదనీ బొత్స అన్నారు. చైర్మన్ పని తీరు మండలి చరిత్రల మచ్చగా నిలిచిపోతుందని బొత్స వ్యాఖ్యానించారు. బొత్స వ్యాఖ్యలపై చైర్మన్ షరీఫ్ తనకు రాజకీయాలు ఆపాదించవద్దనీ, నిబంధనల మేరకు పని చేస్తున్నాననీ వెల్లడించారు. బొత్స వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తొలుత రూల్ 71 కింద శాసనమండలిలో యనమల నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. రూల్ 71 కింద నోటీసు ఇచ్చే అధికారం లేదన్న మంత్రి బుగ్గన వ్యాఖ్యలపై యనమల సభలో రూల్ 71 చదివి వినిపించారు. ఈ నేపథ్యంలో మెజార్టీ సభ్యుల డిమాండ్పై చైర్మన్ చర్చకు అనుమతించిన విషయం తెలిసిందే. మండలిని కించపరిచేలా మంత్రి బొత్స వ్యవహరిస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్సీలకు ఎందుకు ఫోన్ చేస్తున్నారనీ మంత్రి బొత్సను యనమల ప్రశ్నించారు. యనమల వ్యాఖ్యలపై బొత్స స్పందిస్తూ తాను ఎవరికి ఫోన్ చేశానో నిరూపించాలని డిమాండ్ చేశారు.
మరి కొద్ది సేపటిలో ముఖ్యమంత్రి జగన్ మండలికి హాజరుకానున్నారు.
వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు శాసనమండలి విఐపి గ్యాలరీలో కూర్చుని సభలో పరిణామాలను ఆశక్తిగా గమనిస్తున్నారు.