(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: తమ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి ఆలోచిస్తోంది, అమరావతి రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో హైపవర్ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిఎన్ రావు, బిసిజి నివేదికలపై మూడు సార్లు జరిగిన సమావేశాల్లో అధ్యయనం చేసిన అంశాలను ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. అవసరమైతే మరో మారు హైపవర్ కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. రెండు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికను అందజేస్తామని బొత్స తెలిపారు. ప్రధానంగా గడచిన మూడు సమావేశాల్లో చర్చించిన అంశాలతో పాటు తమ అద్యయనంలో వచ్చిన అన్ని అంశాలను సిఎంకు వివరించామని చెప్పారు. హైపవర్ కమిటీ నివేదికపై 20న జరిగే కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు.
13 జిల్లాలతో పాటు అమరావతిని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రైతులకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సిఆర్డిఎ రద్దు అంశం చర్చకు రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అమరావతి రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ ఒప్పందాల కంటే అదనంగా లబ్ది చేకూరే విధంగా ప్రణాళిక ఉంటుందన్నారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలన్నీ పూర్తి చేస్తామనీ, నిర్మించిన అన్ని భవనాలను ఉపయోగించుకుంటామనీ బొత్స చెప్పారు. ఉనికి కాపాడుకునేందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని బొత్స విమర్శించారు. అమరావతి రైతులు చంద్రబాబు మాయలో పడొద్దని సూచించారు. అమరావతిపై గతంలో చంద్రబాబు అఖిలపక్షం అభిప్రాయం కోరలేదని అన్నారు.వ్యక్తిగత స్వార్థంతో చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు.