అమరావతి: రాజధాని ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు బంధువులు, బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బంధువులకు వందల ఎకరాల భూములు ఉన్నాయని మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మరో మారు స్పష్టం చేస్తూ వాటికి సంబంధించి కొన్ని వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించారు.
సుజనా చౌదరి అల్లుడు జితిన్ కుమార్ డైరెక్టర్గా ఉన్న కళింగ గ్రీన్టెక్ కంపెనీకి చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110ఎకరాల భూమి ఉందనీ, సోదరుడి కుమార్తె యలమంచిలి రుషి కన్య పేరు మీద వీరులపాడు మండలం గోకరాజుపల్లిలో 14ఎకరాలు ఉన్నాయని తెలిపారు. ఇడి ఇచ్చిన లిస్ట్లోనే సుజనా చౌదరికి 120 కంపెనీలు ఉన్నాయనీ, వాటిలో కళింగ గ్రీన్ టెక్ కంపెనీ ఒకటి అని బొత్సా అన్నారు. అదే విధంగా చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ వియ్యంకుడైన ఎంఎస్పి రామారావుకు ఏపిఐసిసి నుండి సుమారు 500ఎకరాలు ఇచ్చారని బొత్సా పేర్కొన్నారు.
రాజధాని ప్రాంతంలో తనకు గానీ తన కుటుంబ సభ్యులకు గానీ వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు కాకుండా మరేవీ లేవని ఉంటే చూపాలంటూ సుజనా చౌదరి ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోత్సా మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వాస్తవమని పేర్కొన్నారు. అక్రమాలు మొత్తం వెలికి తీస్తామనీ, వారు తొందర పడాల్సిన అవసరం లేదనీ బొత్సా అన్నారు. ప్రభుత్వం వచ్చి నిండా నూరు రోజులు కాలేదు, మొత్తం అవినీతి అక్రమాలు వెలికి తీయడానికి కొంత సమయం పడుతుందని బొత్సా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసి ప్రతిపక్షం లబ్దిపొందాలని చూస్తోందని బొత్సా విమర్శించారు.