అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణాలపై అనుమానపు మేఘాలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతిని నామకార్ధం కొనసాగించి ముఖ్యమైన కార్యాలయాలు అన్నీ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ ఆలోచన చేస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. హైకోర్టు మాత్రం అమరావతిలో కొనసాగాలని ఇప్పటికే సుప్రీం కోర్టు నిర్దేశించింది. ఒక వేళ హైకోర్టు మార్చాలంటే సుప్రీం కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అమరావతి ప్రాంతంలో సచివాలయాన్ని కొనసాగిస్తూనే పరిపాలనా సంబంధిత ఇతర కార్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. వివిధ కార్యాలయాల నిర్మాణాలకు మంగళగిరి ప్రాంతంలో పదివేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందంటూ వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
అభివృద్ధి అనేది ఒక్క రాజధాని ప్రాంతానికే పరిమితం కాకూడదనీ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని జగన్ ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు ఇప్పటికే పలువురు మంత్రులు పేర్కొన్నారు. మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలు రాజధాని అమరావతి ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించాయి. అమరావతి నుండి రాజధానిని దొనకొండకు తరలిస్తున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ఆర్ఠిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కూడా అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని స్పష్టం చేయడం ఆ వాదనలకు బలం చేకూర్చినట్లు అవుతున్నది. సింగపూర్ పర్యటనలో ఉన్న బుగ్గన అక్కడి ఆంగ్ల పత్రిక ‘ద స్ట్రెయిట్స్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. అభివృద్దిని ఒక నగరానికి పరిమితం చేయడం కాక అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం, అందరికీ సుస్థిర జీవనం, అన్ని చోట్ల ఉత్పాదకరంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనే ప్రభుత్వ ప్రాధమ్యాలని బుగ్గన తేల్చి చెప్పారు.
సింగపూర్లో జరిగిన వాణిజ్య సదస్సులో ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి పివి రమేష్, ఆర్థిక ముఖ్య కార్యదర్శి షంషేర్సింగ్ రావత్లు అమరావతిని తాము విస్మరించలేదనీ, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి కొన్ని నెలలు పడుతుందనీ తెలిపారు. అబివృద్ధి రాష్ట్ర మంతా వికేంద్రీకరించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని వారు పేర్కొన్నారు.
బుగ్గన వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతిని తాము అబివృద్ధి చేయలేమని ఆర్థిక మంత్రి బుగ్గన చేతులేత్తేశారని యనమల విమర్శించారు. రాజధాని అబివృద్ధికి నిధులు లేవని ఆయన చెప్పడం హాస్యాస్పదమని యనమల అన్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియన్ బ్యాంకు రుణాల పొగొట్టి ఇప్పుడు అమరావతికి నిధులు లేవని చేతులెత్తేస్తారా అంటూ యనమల నిలదీశారు. ఇంతకన్నా దివాలాకోరుతనం ఏముంటుందని ఆయన అన్నారు. తాజాగా బుగ్గన ప్రకటనతో అమరావతి ఇక పేరుకే పరిమితం అవ్వనుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.