(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సంక్షేమ పథకాల అమలుపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారనేది అందరికీ తెలిసిందే. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన నవరత్న పథకాలను వరుసగా అమలు చేస్తూ వస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అప్పులు తెచ్చి మరీ వాటిని దాదాపు 90 శాతం హామీలను నెరవేర్చారు.
ఈ ఏడాది ద్వితీయార్థం నుండి కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్ డౌన్ అమలుతో ఆదాయం గణనీయంగా తగ్గిపోయి రాష్ట్ర అర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ చేయాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకై జగన్మోహనరెడ్డి సర్కార్ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుండి అవసరమైన నిధులు, సహకారాన్ని కోరడానికి సన్నద్దం అయ్యింది జగన్మోహనరెడ్డి ప్రభుత్వం.
ఈ క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర సహకారాన్ని అభ్యర్థించేందుకు పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేడు ఢిల్లీ పయనమై వెళ్లారు. కేంద్ర మంత్రులను, కార్యదర్శులను మంత్రి గౌతమ్ రెడ్డి కలిసి రాష్ట్రాభివృద్ధికి నిధులు, అవసరమైన సహకారాన్ని కొరనున్నారు. నేటి మధ్యాహ్నం ఢిల్లీలోని లోధి హోటల్లో భారత పర్యాటక అభివృద్ధి సంస్థ సిఎండి కమల వర్థనరావు, జాతీయ థర్మల్ పవర్ కార్పోరేషన్ సిఎండి గురుదీప్ సింగ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అనిల్ కుమార్ చౌదరి, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సిఎండి నలిన్ సింఘాల్ తదితరులతో మంత్రి గౌతమ్ రెడ్డి వరుస సమావేశాల నిర్వహించనున్నారు.
ఈ సందర్భంలో ఏపిలోని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ గురించి వివరించి పర్యాటక తదితర రంగాలలో అవసరమైన సహకారాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి కోరనున్నారు. మంత్రి మేకపాటి వెంట ఈ ఢిల్లీకి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి, సిఈఒ అర్జా శ్రీకాంత్ వెళ్లారు.