న్యూఢిల్లీ: రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసి పోలవరం పాజెక్టు సందర్శనకు రావాల్సిందిగా ఆహ్వానించామని పెద్దిరెడ్డి చెప్పారు. సెప్టెంబర్ నెలలో ప్రాజెక్టు సందర్శనకు వస్తామని ఆయన హామీ ఇచ్చారని పెద్దిరెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రి ప్రాజెక్టు సందర్శన అనంతరం ఏమి నిర్ణయం తీసుకుంటారో చూద్దామని పెద్దిరెడ్డి అన్నారు. ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించే ఆలోచన లేదని పెద్దిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని పెద్దరెడ్డి తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని ఒక విలేఖరి ప్రశ్నించగా ‘ఆలు లేదు సోలు లేదు అల్లుడి పేరు సోమలింగం’ అన్న సామెత మాదిరిగా ఉందని పెద్దిరెడ్డి చమత్కరించారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభం అయ్యిందని ఆయన అన్నారు. ఈ నెల 17వ తేదీనే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చామనీ, త్వరలోనే టెండర్లను ఖరారు చేస్తామని పెద్దిరెడ్డి చెప్పారు. రికార్డు టైమ్లో పోలవరం పనులు పూర్తి చేస్తామని పెద్దిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం కూడా సానుకూలవైఖరితోనే ఉందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్నది వైసిపి ప్రభుత్వ లక్ష్యమనీ అందుకు అనుగుణంగా తాగునీటి ప్రాజెక్టులు చేపడుతున్నామని పెద్దిరెడ్డి అన్నారు. 60వేల కోట్ల రూపాయల అంచనాలతో సెప్టెంబర్లో టెండర్లు పిలుస్తామని పెద్దిరెడ్డి చెప్పారు.30వేల కోట్ల రూపాయల సహాయం అందించాలని కేంద్రాన్ని కోరామని పెద్దిరెడ్డి వివరించారు.