అమరావతి: బోస్టన్ నివేదికను వివరించిన ప్రణాళికా సంఘం కార్యదర్శి విజయ్ కుమార్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పినిపె విశ్వరూప్, తానేటి వనిత, ఆదిమూలపు సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
రాజధానిపై బీసీజీ నివేదికను మున్సిపల్శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి విజయ్కుమార్ తన బాధ్యతల నిర్వహణలో భాగంగా వివరించారని అన్నారు. ఈ వివేదికపై చంద్రబాబు చవకబారు విమర్శలు చేశారని మండిపడ్డారు. విజయ్ కుమార్ గారిని… విజయ్ కుమార్ గాడు అనడం ద్వారా చంద్రబాబు తన కుల దుహంకారాన్ని మరోసారి బయటపెట్టుకున్నారన్నారు. బీసీజీ నివేదికను మున్సిపల్శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి విజయ్కుమార్ ఒక ఐఏఎస్గా, ప్రభుత్వాధికారిగా, తన బాధ్యతల నిర్వహణలో భాగంగా వివరించారని మంత్రులు లేఖలో పేర్కొన్నారు. ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు వ్యాఖ్యానించిన చంద్రబాబు.. బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీ మహిళలమీద చేయిచేసుకోవడం లాంటి సంఘటనలతో పలుమార్లు కులపరంగా తనకున్న దురహంకారాన్ని బటయపెట్టారని ఈ సందర్భంగా మంత్రులు గుర్తు చేశారు. విజయ్కుమార్ బాధ్యతలు ఏంటో ఆయన కులం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. అయినా ఉద్దేశ పూర్వకంగా విజయ్కుమార్ని గాడు అని సంబోధించడం ద్వారా తనను ఏ వ్యవస్థలూ ఏం చేయలేవన్న… అహంకార పూరిత వైఖరిని కూడా చంద్రబాబు ప్రదర్శించారు.
40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకు భాషా సంస్కారంగాని, కులపరమైన సంస్కారం గాని, సామాజిక న్యాయంపట్ల గౌరవం గాని, భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం గాని లేవని మరోసారి స్పష్టమైందన్నారు. ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాల్సిందిగా హెచ్చరించారు. చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి పాదాలు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందిగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా స్వయంగా విజయ్కుమార్ వద్దకు వెళ్లి, ఆయనకు కూడా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇది జరిగేవరకూ చంద్రబాబు ఏ గ్రామంలో అడుగుపెట్టదలుచుకున్నా, అక్కడి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు వీరుమాత్రమే కాకుండా శాంతిభద్రతలను గౌరవించే ప్రతి ఒక్కరూ చంద్రబాబును చీకొట్టాలని విజ్ఞప్తిచేస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు.