(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేంద్రంగా మళ్లీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో గురువారం పర్యటించబోతున్న తరుణంలో అధికారపక్షం వేస్తున్న అడుగులు రాజకీయ వేడిని రగిలించాయి.
2019 ఎన్నికలలో పరాజయం పాలయిన తర్వాత చంద్రబాబు తన కలల రాజధాని ప్రాంతంలో పర్యటనకు బయలుదేరడం ఇదే మొదటిసారి. ఈ నిర్ణయం సహజంగానే వైసిపిలో కదలిక పుట్టించింది. వెంటనే రాజధాని ప్రాంతం రైతులు కొందరు మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాజధాని కోసం భూములిచ్చినపుడు చంద్రబాబు తమకు చాలా హామీలు ఇచ్చారనీ, ఒక్కటీ నెరవేర్చలేదనీ వారు అన్నారు. తమకు క్షమాపణ చెప్పికానీ చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వీలు లేదని వారు అన్నారు. మరోపక్క పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రెచ్చిపోయారు. శ్మశానాన్ని చూడడానికి వస్తున్నావా బాబూ అంటూ హుంకరించారు. శ్మశాన పదప్రయోగం వికటించేసరికి సర్దుకున్నారు. అది వేరే విషయం. తమకు రాజకీయాలు లేవనీ, న్యాయం కోరుతూ ముఖ్యమంత్రిని కలవాలంటే కూడా కలవనివ్వడం లేదనీ అమరావతి రైతులు మరో సమావేశంలో వాపోయారు.
చంద్రబాబు రాజధాని పర్యటన వైసిపికి కలవరం కలిగించాల్సిన అవసరం ఏముంది? ఆరు నెలల క్రితం వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విషయంలో అధికారపక్షం వీలైనంత అనిచ్ఛితి తీసుకువచ్చింది. బొత్స వంటి మంత్రులు రకరకాలుగా మాట్లాడుతూ ప్రజల్లో విపరీతమైన అయోమయం సృష్టించారు. ప్రభుత్వం సింగపూర్ స్టార్టప్ వంటి ప్రాజెక్టులను రద్దు చేసింది. రాజధాని విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొత్త కమిటీ వేసింది. దానితో సహజంగానే రాజధాని ప్రాంతం రైతులు ఆందోళన చెందారు. రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందేమోనన్న అనుమానం వారికి నిద్ర లేకుండా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు అమరావతి పర్యటన పెట్టుకున్నారు.
రెండవపక్క రాజధానిని తరలించడం అంత తేలిక కాదని అధికారపక్షం నేతలకు తెలిసివచ్చింది. కేంద్రం ఈ విషయంలో స్పష్టమైన సూచనలు ఇచ్చింది. దానిమీదట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం మొదటిసారిగా రాజధాని విషయంలో నోరు విప్పారు. నిధులు లేవు కాబట్టి రాజధాని నిర్మాణాలు కుదించండి అంటూ ఆయన సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తద్వారా రాజధానిగా అమరావతి కొనసాగుతుందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధానిలో పర్యటించి చంద్రబాబు రాజకీయంగా పైచేయి సాధించడం సహజంగానే వైసిపి సహించగలిగే విషయం కాదు. అందువల్లనే రాజధానిలో వేడి పుడుతోంది.