అమరావతి: మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటడం లేదు ఇదీ వైసిపి ప్రభుత్వ తీరు అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో మంగళవారం ఆయన టిడిపి నేతలతో కలిసి పర్యటించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గీతానగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామా నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ముంపు బాధితులను పరామర్శించారు. వరద బాధితులు తమ సమస్యలను చంద్రబాబుకు విన్నవించారు. పిల్లలతో పాటు తామంతా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు వైసిపి ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం ఫ్లడ్ మానిటరింగ్లో పూర్తిగా విఫలమయ్యిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రాజెక్టుల్లో కొంత నీరు ముందే విడుదల చేసి ఉంటే ఇంత వరద వచ్చేది కాదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ అసమర్థ చర్యల వల్ల ప్రజలు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసి వేయకుండా ఉంటే పేదలు ఈ పరిస్థితుల్లో ఐదు రూపాయలతో హాయిగా భోజనం చేసేవారని చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత కారణంగా కార్మికులకు పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ నోటీసు ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. తన ఇంటిని వరద నీటితో ముంచేందుకు కుట్ర చేశారని చంద్రబాబు ఆరోపించారు.
విజయవాడ ముంపు ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మించాలనీ, స్థానికులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ముంపు బాధితులకు తక్షణం ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. తన ఆరోగ్యం బాగాలేకపోయినా మనసంతా ప్రజల దగ్గరే ఉందని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు వెంట ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నేతలు దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.