అమరావతి: కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే ఏపి, తెలంగాణలు భారత్, పాక్ మాదిరిగా మారతాయని గతంలో జగన్ అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేస్తూ, ఇప్పుడు జగన్ ఆ రాష్ట్రాన్ని వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో చంద్రబాబు మాట్లాడూతూ జగన్ తనకు అన్నీ తెలుసు అనుకోవడం అవివేకమవుతుందని చంద్రబాబు విమర్శించారు. జగన్ వయస్సు తన రాజకీయ అనుభవమంత ఉందని చంద్రబాబు అన్నారు.
తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, సఖ్యత దెబ్బతింటేనే ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని గుర్తు చేస్తూ తొందర పాటు నిర్ణయాలు మంచిది కాదని చంద్రబాబు సూచించారు. శాసనసభలో మాట్లాడే ప్రతి అంశాన్ని ప్రజలు చూస్తున్నారనీ, భావితరాల భవిష్యత్తు తాకట్టు పెట్టే అధికారం ఎవరికీ లేదని చంద్రబాబు అన్నారు.
సున్నితమైన అంశాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిపద్ధతి కాదని చంద్రబాబు అన్నారు. ఇతరుల దయాదాక్షిణ్యాలపై జగన్ ఆధారపడవద్దని సూచిస్తున్నానన్నారు. సభలో తనను మాట్లాడనీయకుండా చేసినప్పటికీ ప్రజలు నిజాలు గ్రహిస్తారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తనపై చౌక బారు విమర్శలు చేసినా భవిస్తానని చంద్రబాబు అన్నారు.