(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కడప: టిడిపి, వైసిపి పార్టీలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. కడప పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్, చంద్రబాబు రాష్టానికి రాహు, కేతువుల్లా తయారైయ్యారని విమర్శించారు. అంతర్జాతీయ స్ధాయి రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారని అన్నారు. ఒక రాజధానికే దిక్కలేదు, మూడు రాజధానులంటూ జగన్ అరచేతిలో కైలాసం చూపిన్నారని విమర్శించారు. రాజధాని మార్పు చారిత్రాత్మిక తప్పిదమన్నారు. రాజధాని మార్పు ఆలోచన పిచ్చి తుగ్లక్ ఆలోచనగా ఆయన అభివర్ణించారు.
అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని జగన్ ఆమోదించి నమ్మించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల సందర్బంగా వైసిపి అధికారంలోకి వస్తే రాజధాని మార్పు చేస్తారన్న ప్రచారాన్ని వైసిపి నేతలు ఖండించారని తులసిరెడ్డి గుర్తు చేశారు.
నాడు అమరావతిలోనే రాజధాని ఉంటుందని వైసిపి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారన్నారు. ఇలా నమ్మించి ఎన్నికలలో గెలిచిన తరువాత ఇప్పుడు మాట మార్చడం ఏమిటని తులసిరెడ్డి ప్రశ్నించారు.
రాజధాని మార్చాలని భావిస్తే ప్రజాభిప్రాయ సేకరణ కోసం అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని తులసిరెడ్డి సవాల్ విసిరారు. పవిత్రమైన దేవాలయంలాంటి అసెంబ్లీలో రాజధానిపై తీర్మానం చేశారన్నారు. భారతదేశ చిత్ర పటంలో రాజధానిగా అమరావతిని గుర్తించారని చెప్పారు.
అమరావతి నుంచే పాలన సాగిస్తూ పన్నుల రూపంలో ప్రజల రక్తాన్ని పిండి వసూలు చేసిన డబ్బును రాజధానికి ఖర్చు చేశారన్నారు. రాజధాని నిర్మాణం కోసం చేసిన ఖర్చు చేసిన 9, 500 రూపాయల డబ్బు చంద్రబాబుదో, జగన్ దో, మోడీదో కాదని తులసి రెడ్డి అన్నారు.