(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని మార్పును అడ్డుకోగల శక్తి ఎవరున్నారా అని అమరావతి రైతులు దిక్కులు చూస్తున్న తరుణంలో వారికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కనబడ్డారు. ఇప్పడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది. మంగళవారం స్వర్ణభారతి ట్రస్టుకు వచ్చిన వెంకయ్యనాయుడును అమరావతి ప్రాంత రైతులు కలుసుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. కళ్ల నీళ్ల పర్యంతమవుతూ తమను రక్షించాల్సిందిగా వేడుకున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో ఉన్న వెంకయ్య నాయుడు ఆంధ్రుల ప్రయోజనాలకు తాము పూచీ పడతామని చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అయిదేళ్లు కాదు పదేళ్లు ఉండాలన్నారు. అవశేష ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్కు మద్దతు పలికారు.
విభజన అనంతరం బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్రమంత్రి హోదాలో వెంకయ్య నాయుడు నవ్యాంధ్రకు చేదోడువాదోడుగా నిలబడ్డారు. విభజన హామీల అమలు విషయంలో సంబంధిత కేంద్ర శాఖల మంత్రులకూ ముఖ్యమంత్రి చంద్రబాబుకూ మధ్య సంధానకర్తగా నిలిచారు. ఇంతలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు రావడం, బిజెపి అగ్రనాయకత్వం వెంకయ్యను ఆ పదవికి ఎంపిక చేయడం జరిగిపోయింది. నవ్యాంధ్రకు కేంద్రంలో ఉన్న ఒక్క అండా లేకుండా పోయిందని అప్పట్లో రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు కూడా.
ఇప్పుడు మళ్లీ వెంకయ్య అవసరం వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల పల్లవి ఎత్తుకునే సరికి హతాశులైన రాజధాని రైతులు కేంద్రం ఆదుకోకపోతుందా అన్న ఆశతో ఉన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేసిన అమరావతి నుంచి రాజధానిని మరోచోటికి తరలించడాన్ని కేంద్రం ఎలా సహిస్తుందని వారు అంటున్నారు.
అన్ని విషయాలూ తెలిసిన వెంకయ్యనాయుడు ప్రధానికి పరిస్థితి వివరించి చక్రం అడ్డు వేయాల్సిందిగా కోరాలని రైతులు ఆశిస్తున్నారు. ఇటు రాష్ట్ర బిజెపి కూడా రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నది. కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి ఆయనకు పరిస్థితి వివరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం కూడా రాజధాని మార్పు పరిణామాల గురించి ఆరా తీస్తోందని చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో వెంకయ్యనాయుడును రైతులు కలిసి తమను ఆదుకోవాల్సిందిగా కోరారు. తాను రాజ్యాంగబధ్ధ పదవిలో ఉన్నాననీ, దేనిపైనా బహిరంగంగా వ్యాఖ్యానించలేననీ ఆయన వారితో అన్నారు. అయితే తనకు విషయాలు అన్నీ తెలుసుననీ, ఎవరి దగ్గర ఏం చెప్పాలో అక్కడ అది చెబుతాననీ ఆయన అభయం ఇచ్చారు. దీనితో వెంకయ్య హామీ ఎప్పటికి ఎలా ఫలితం ఇస్తుందోనన్న చర్చ మొదలయింది.