(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి రాజధాని తరలింపునకు సంబంధించిన రెండు బిల్లులనూ ఆమోదింపజేసుకోవడంలో వైసిపి ప్రభుత్వానికి శాసనమండలి గడ్డు సమస్యగా మారింది. బిల్లులకు సోమవారం అసెంబ్లీలో ఆమోదం పొందిన ప్రభుత్వం, శాసనమండలిలో మెజారిటీ పక్షమైన టిడిపి అక్కడ ఎలాంటి వ్యూహం ప్రయోగిస్తుందో ఊహించడంలో విఫలమయింది.
ఉదయం మంత్రులు బొత్స సత్యనారాయణ, పి. విశ్వరూప్ బిల్లులు ప్రవేశపెట్టిన తరవాత టిడిపి అనూహ్యంగా రూల్ 71 తెరపైకి తెచ్చింది. దాని కింద ప్రభుత్వ విధానాన్ని చర్చకు చేపట్టాలని నోటీసు ఇచ్చింది. మండలి ఛైర్మన్ ఎమ్ఎ షరీఫ్ అందుకు అంగీకరించడంతో అధికారపక్షం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ముందు బిల్లులపై చర్చ చేపట్టాలని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, మునిసిపల్ వ్యవహారాల మంత్రి బొత్స సత్యనారాయణ కోరినప్పటికీ ఫలితం లేకపోయింది.
రూల్ 71 కింద నోటీసు స్వీకరించినా దానిపై వారం రోజులే లోపు చర్చ చేసేందుకు వీలుందని బుగ్గన బిజినెస్ రూల్స్ ఎత్తిచూపినా పని కాలేదు. ఎప్పుడు చర్చ చేపట్టాలన్నది తన విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుందని ఆయన మంత్రులకు స్పష్టం చేశారు. దానితో గత్యంతరం లేని పరిస్థితుల్లో మంత్రులే సభను మూడు సార్లు వాయిదా వేయించారు.