(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఆనం రామనారాయణ రెడ్డి పెద్దమనిషి. అలాంటి వ్యక్తి నోట ఏ మాట వచ్చినా జనం ఆలకిస్తారు. కాస్త ఆలోచిస్తారు. అందుకే నెల్లూరు జిల్లా మాఫియాకు అడ్డాగా మారిందన్న ఆనం వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఆనం వ్యాఖ్యలకు కారణమేమయి ఉంటుందా అన్న చర్చ మొదలయింది.
ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసిపిలో చేరారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లెక్కల ప్రకారం మంత్రివర్గంలోకి జిల్లా నుంచి ప్రాతినిధ్యం విషయంలో ఆనం పేరు పరిశీలనలోకి రాలేదు. అయితే ఆనం కూడా ఆ విషయంలో అన్యధా భావించింది లేదు. ముందు నుంచీ పార్టీలో ఉన్నవారిని వదిలిపెట్టి తనకు పదవి ఇస్తారని ఆయన అనుకోలేదు కూడా.
అయితే ఇటీవల నెల్లూరు జిల్లాలో సంభవిస్తున్న పరిణామాలకు ఆనం కాస్త నొచ్చుకున్నట్లు కనబడుతోంది. విఆర్ కాలేజి విషయంలో ఈ మధ్య నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యవహరించిన తీరు ఆనంకు మనస్థాపం కలిగించిందని అంటున్నారు. ఇటీవల జాయింట్ కలక్టర్ సమక్షంలో జరిగిన సమావేశంలో, కాలేజీలో ఆనం వివేకానంద రెడ్డి ఫొటో ఉండడం పట్ల వైసిపి సభ్యులు ఆక్షేపణ చెప్పినట్లు తెలిసింది. దివంగతుడైన మాజీ ఛైర్మన్ ఫొటో ఉండకూడదని అనడం ఏమిటని ఆనం తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
విఆర్ కాలేజి కమిటీపై కోటంరెడ్డికి పెత్తనం ఇచ్చేందుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఇటీవల కోటంరెడ్డి విఆర్ కాలేజి నిర్వహణలో అవినీతి ప్రస్తావన తెచ్చారు. అవినీతికి పాల్పడిన వారిని ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ పరిణామాలన్నీ ఆనం రామనారాయణ రెడ్డికి మనస్తాపం కలిగించాయనీ, ఆయన మాఫియా వ్యాఖ్యలకు ఇవే కారణమనీ చెబుతున్నారు.