విశాఖపట్నం, ఏప్రిల్ 3: ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్తతరం నాయకుడిని కోరుకుంటున్నారని బిఎస్పి అధినేత్రి మాయావతి అన్నారు. తమ కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని మాయావతి పేర్కొన్నారు.
విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో పవన్తో కలిసి మాయావతి మాట్లాడారు.అసెంబ్లీ, లోక్సభ రెండింట్లోనూ జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని మాయావతి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా కాలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగలేనీ, అభివృద్ధి జరగకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందని మాయావతి అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి తగిన న్యాయం జరగలేదన్నారు. ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి మోది ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాయావతి స్పష్టం చేశారు.
ప్రజలు చంద్రబాబు, జగన్ వలలో పడవదని మాయావతి సూచించారు. ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని మాయావతి కోరారు. పవన్ వంటి యువ నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మాయావతి ఆశాభావం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్తో పాటు బిఎస్పి, వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయని మాయావతి పేర్కొన్నారు. తమ కూటమికి ప్రజల నుండి మద్దతు లభిస్తుందని భావిస్తున్నామని మాయావతి అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాయావతి చెప్పారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బిఎస్పితో కలిసి పని చేస్తుండటం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. దళితులను సిఎం చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు కానీ ఆ హామీని ఆయన విస్మరించారని పవన్ అన్నారు. మాయావతిని ప్రధాన మంత్రిగా చూడాలన్నదే తమ కల అని పవన్ స్పష్టం చేశారు. 2014లో అప్పటి పరిస్థితుల కారణంగా బిజెపి, టిడిపితో కలిసి పని చేశామనీ, నేడు సన్నిహితులు, మేధావులు బిఎస్పి కలవాలని సూచించారని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.