(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలలో అయిదింటిని ఆ పరిధి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవా? జనాభా లెక్కల సేకరణ కోసం భారత రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన నోటిఫికేషన్ చూస్తే చెల్లవనే బోధ పడుతున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో ఈ పని చేసిందీ తెలియడం లేదు కానీ దానికి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ అడ్డం పడుతుందని మాత్రం తెలుస్తున్నది.s
రాజధాని పరిధిలోని నవులూరు, బేతపూడి, ఎర్రపాలెం, పెనుమాక, ఉండవల్లి పంచాయితీలను రాజధాని పరిధి నుంచి తప్పించి మంగళగిరి, తాడేపల్లి మునిసిపాలిటీలలో విలీనం చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి జీవోలు జారీ చేసింది. రాజధాని పరిధిలోని 25 గ్రామ పంచయితీలతో పాటు మరో మూడు పంచాయితీలను కొత్తగా కలిపి అమరావతి క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఒకపక్క ఉండగా ఈ అయిదు గ్రామ పంచాయితీలను రెండు మునిసిపాలిటీలలో కలిపారు.
మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న వ్యూహంలో భాగంగా సిఆర్డిఎ రద్దు, అనంతరం క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమయింది. సిఆర్డిఎ రద్దు బిల్లు మండలి నుంచి సెలక్ట్ కమిటీకి వెళ్లడంతో ఆ ప్రక్రియ పెండింగ్లో పడింది.
ఈ సంవత్సరంలో జరిగే జాతీయ జనాభా పట్టిక (ఎన్పిఆర్) సవరణ కార్యక్రమం కోసం భారత రిజిస్ట్రార్ జనరల్ 2019 డిసెంబర్ 26న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రక్రియ చేపట్టనున్న దృష్ట్యా 2020 జనవరి 1 నుంచి 2021 మార్చి 31 వరకూ కొత్త పాలనా యూనిట్లను ఏర్పరచడం కానీ, పాలనా యూనిట్ల పరిధులను మార్చడం కానీ చేయవద్దని అందులో అన్ని రాష్ట్రాలనూ కోరారు. దాని ప్రకారం రాజధాని పరిధిలో ప్రభుత్వం ప్రకటించిన మార్పులు చెల్లుబాటు కావని స్పష్టమవుతున్నది.