(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి వైసిపిలోకి టిడిపి ఎమ్మెల్యేలు ఫిరాయించే వ్యవహారం ప్రస్తుతానికి వెనక్కుపోయినట్లేనా. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లా నుంచి ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అధికారపక్షంలోకి ఫిరాయించడం ఖాయమయిందన్న వార్తలకు శుక్రవారం టిడిపి కేంద్ర కార్యాలయం ప్రారంభం సందర్భంగా తెరపడింది.
నిన్న పార్టీ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నుంచి మొత్తం నలుగురు సభ్యులూ హాజరయ్యారు. దీనితో వైసిపి వైపు చూస్తున్న సభ్యులను టిడిపి అధినేత చంద్రబాబు కట్టడి చెయ్యగలిగారన్న మాట వినబడింది. పార్టీ వర్గాల కథనం ప్రకారం నిజానికి చంద్రబాబు వారితో మాట్లాడినపుడు వారి యోగక్షేమాలు విచారించి, పార్టీ కార్యాలయం ప్రారంభానికి ఆహ్వానించడం తప్ప వేరే ప్రస్తావన రాలేదు.
మొత్తం మీద నలుగురూ పార్టీ కార్యక్రమానికి హాజరు కావడం టిడిపి వర్గాలకు ఒక సంకేతం పంపింది. వైసిపి లోకి జంప్ చేసే అవకాశం ఉన్నట్లు వినబడిన మరో శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. దీనితో వత్తిళ్లు వచ్చినా టిడిపి శాసనసభ్యులు పార్టీ మారబోరన్న సంకేతం వెలువడింది.
ఇలా ఎంతకాలం నడుస్తుందన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ముప్పు తప్పింది కదా అనుకుంటున్నారు. ఒకేసారి ముగ్గురు నలుగురు శాసనసభ్యులు అధికారపక్షంలోకి ఫిరాయిస్తే పార్టీ కార్యకర్తలలో స్థైర్యం కొరవడుతుందన్న భయం నాయకత్వాన్ని వెన్నాడుతోంది. ఇప్పుడా భయం తీరిపోయింది. భవిష్యత్తులో కూడా గ్రానైట్ క్వారీ వ్యాపారం ఉన్న కారణంగా అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్పై వత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది తప్ప వేరే అవకాశాలు ఉండవని పార్టీ నాయకత్వం భావిస్తోంది.