అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్హాట్గా మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు బుధవారం పరోక్షంగా వంశీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘వంశీ ఇంకా పార్టీలోకి రాలేదు. వంశీ పార్టీలోకి వస్తే అప్పుడు స్పందిస్తా, నేను పార్టీ అధినేత జగన్ విధేయుడిని, ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా, నాపై ఎటువంటి కేసులు లేవు, నాకు క్యారెక్టర్ ఉంది, పార్టీలు మారే మనిషిని కాదు, రోజుకు ఒక మాట మాట్లాడే నైజం నాది కాదు’ అంటూ యార్లగడ్డ మీడియా సమావేశంలో కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు. వంశీ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. తాను ఎవరిపైనా కేసు పెట్టించలేదని యార్లగడ్డ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికలలో ప్రత్యర్ధులుగా ఉండి పరస్పరం తీవ్రంగా విమర్శలు చేసుకున్న వ్యక్తులు. ఆ వైరం కొనసాగుతున్నదనడానికి వెంకట్రావు మాటలే తార్కాణం. ఇలాంటి వారు ఒకే పార్టీలో కలిసి సఖ్యతగా కలిసి పని చేయడం సాధ్యమేనా? వంశీ అధికారికంగా వైసిపిలో చేరితే ఆ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా ఉన్న యార్లగడ్డ ఏమి చేస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
టిడిపి తరపున గెలిచిన వల్లభనేని ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్ వెంట నడుస్తానని కూడా ప్రకటించారు. అయితే పార్టీలో అధికారికంగా ఎప్పుడు చేరుతున్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే తెలుగుదేశం పార్టీ వంశీ రాజీనామాను ఆమోదించలేదు కానీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వంశీ మీడియా సమావేశాల్లో వెల్లడించినప్పటికీ రాజీనామా చేసే ఆలోచన ఆయనకు లేనట్లు కనబడుతున్నది. ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఘోర పరాజయం పాలైనందుకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించారా అని కూడా ప్రశ్నిస్తున్నారు వంశీ. ఈ మాటలను బట్టి చూస్తే వైసిపికి అనుకూలంగా ఉంటూ అసెంబ్లీలో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాల నుండి వినబడుతోంది. వైసిపిలో వంశీ చేరికను స్వాగతిస్తానని ఇప్పటికే ప్రకటించిన ఆ నియోజకవర్గ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో బుధవారం వంశీ భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ వారిద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఏ విధంగా ప్లాన్ వేస్తారో చూడాలి.