అమరావతి: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఈ ప్రజావేదికతోనే మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెల్లడించి అయిదు నెలలు దాటినా రాష్ట్ర వ్యాప్తంగా ఆ దిశగా అధికారులు తీసుకున్న చర్యలు లేకపోవడంపై ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఆయన నివాసానికి సమీపంలో లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులతో ప్రజావేదికను నిర్మించారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలి ఐఎఎస్, ఐపిఎస్ల సమావేశం ఈ ప్రజావేదికలో నిర్వహించారు. ఈ సమావేశంలోనే జగన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ భవనం పర్యావరణ నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన అక్రమ కట్టడమని దీన్ని తక్షణం కూల్చివేయాలని అధికారులకు ఆదేశించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఈ భవనంతోనే ప్రారంభించాలని కూడా అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు 24గంటల గడవకముందే ప్రజావేదికను నేలమట్టం చేశారు.
దీనిపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అనుమతులు లేకుండా, పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన ప్రైవేటు భవనాలను వదిలివేసి ప్రభుత్వ భూమిలో, ప్రభుత్వ ధనంతో నిర్మించిన భవనాన్ని దుందుడుకుగా కూల్చివేయాల్సిన అవసరం ఏముందో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని అన్నారు. అయిదు నెలల తరువాత ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే ప్రభుత్వ భవనాన్ని కూల్చివేసిన తరువాత మొత్తం చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమణలపై ఒక ప్రణాళిక తయారు చేసి అమలు చేస్తారు అని అనుకున్నాననీ, తనకు తెలిసి అట్లాంటి చర్యలు ఎక్కడ కనిపించలేదనీ ఐవైఆర్ అన్నారు.
5 నెలల తరువాత ఈ ప్రశ్న వేయటం గురించి కొందరు ప్రస్తావించారు. ప్రభుత్వ భవనాన్ని కూల్చి వేసిన న తర్వాత మొత్తం చెరువులు నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై ఒక ప్రణాళిక తయారు చేసి అమలు చేస్తారు అని అనుకున్నాను.
నాకు తెలిసి అట్లాంటి చర్యలు ఎక్కడ కనిపించలేదు. అందుకే ఈ ప్రశ్న. https://t.co/UresftEIvA— IYRKRao , Retd IAS (@IYRKRao) November 18, 2019