విశాఖపట్నం: ఇసుక కొరత వల్ల కష్టాలు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు అండగా విశాఖలో లాంగ్మార్చ్ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను టిడిపి దత్తపుత్రుడని అంటున్న వైసిపి నేతలకు సమాధానంగా నేను ఎవరికీ దత్తపుత్రుడిని కాదు. ప్రజలకు దత్తపుత్రుడిని అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఇసుక కొరత సమస్యను పరిష్కరించాల్సింది పోయి వైసిపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబుపై ఉన్న కోపాన్ని ఇసుకపై చూపిస్తున్నారని అన్నారు. వైసిపి నేతలు అద్భుతమైన పాలన అందిస్తే తాను వెళ్లి సినిమాలు చేసుకుంటానని ఆయన అన్నారు. వైసిపి భాధ్యతాయుతంగా వ్యవహరించిఉంటే తాను అసలు జనసేన పార్టీ పెట్టేవాడినే కాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
వైసిపి ప్రభుత్వానికి రెండు వారాల సమయం ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. ఈలోపు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి ప్రతిఒక్క కార్మికుడికీ 50 వేల రూపాయలు ఇవ్వాలని ఆయన చెప్పారు. ఇసుక కొరత కారణంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల సహాయం అందించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో తాను అమరావతిలో నడవాల్సివస్తుందనీ, ఏ పోలీసులు ఆపుతారో చూస్తాననీ ఆయన హెచ్చరించారు. లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇన్ని కష్టాలు అనుభవిస్తుంటే ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో అనుభవించే హక్కు వైసిపి శాసనసభ్యులు, మంత్రులకే లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఈ అయిదు నెలల్లో ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా విఫలం అయిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రజలు రోడ్లపైకి వచ్చారంటేనే ప్రభుత్వం వైఫల్యం చెందినట్లని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం పాలనను కూల్చివేతలతో మొదలుపెట్టిందనీ, ఇది కూడా కూలిపోతుందనీ ఆయన అన్నారు.
తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విజయసాయి రెడ్డిని ఉద్దేశించి, సూట్కేసు కంపెనీలు పెట్టిన వారు రాజ్యసభకు వెళ్లడం మన దురదృష్టం. ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడేవాడిని కాదు. ఎక్కువ మాట్లాడితే ఏం చేయాలో తెలుసు జాగ్రత్త అన్నారు పవన్ కళ్యాణ్.