అమరావతి: ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకునేందుకు ముగ్గురు మంత్రులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. టిడిపికి ఉన్న 23మంది ఎమ్మెల్యేలలో కనీసం అరడజను మంది ఎమ్మెల్యేలను దూరం చేస్తే అసెంబ్లీలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా గల్లంతు అవుతుంది. ఇప్పటికే కృష్ణాజ్లిలాలో గెలిచిన ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసిపి వైపుకు వెళ్లారు. ఇదే మాదిరిగా ప్రకాశం జిల్లాలో టిడిపి నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురిని వైసిపిలో చేర్చుకునేందుకు ముగ్గురు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు ఆ ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా ఆపుకోగలరా లేదా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయా ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లాలో చీరాల నుండి కరణం బలరాం, అద్దంకి నుండి గొట్టిపాటి రవికుమార్, పరుచూరు నుండి ఏలూరి సాంబశివరావు, కొండపి నుండి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామిలు టిడిపి ఎమ్మెల్యేలుగా ఉండగా వీరిలో ముగ్గురిని తమ వైపుకు లాక్కొనే ప్రయత్నాలకు అధికార పార్టీ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఇటీవల గొట్టిపాటి రవికుమార్తో మంతనాలు జరిపారనీ, ఆయన పార్టీ మారేందుకు సుముఖత వ్యక్తం చేయలేదనీ తెలిసింది. దీంతో ఆయన క్వారీలే లక్ష్యంగా విజిలెన్స్ అధికారుల తనిఖీలు జరిగాయని జిల్లాలో ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రంగంలోకి దిగి గొట్టిపాటితో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల ఒక కార్యక్రమంలో కలిసిన కరణం బలరాంతోనూ బాలినేని చర్చించి పార్టీలోకి రమ్మని ఆహ్వానించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టిడిపి ఎమ్మెల్యేలను వైసిపిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న కొడాలి నాని, పేర్ని నాని విజయవాడలో మంత్రి బాలినేని నివాసంలో సమావేశమై చర్చించినట్లు సమాచారం. వీరు ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి ఈ విషయాలపై చర్చించనున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.