అమరావతి: పరిపాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలి కానీ అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా అని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరు నెలల కాలంలో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం చేసిన అప్పులపై ట్విట్టర్ వేదికగా శనివారం విమర్శలు గుప్పించారు.
ఆరు నెలల్లో వైసిపి ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆరు నెలల్లో దాదాపు 25 వేల కోట్ల రూపాయలు అంటే నెలకు సుమారు మూడున్నర వేల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదని అన్నారు. ఒక్క ఆగష్టులోనే అయిదు సార్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
వైసిపి ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చానని తిరిగి తనపైనే ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని అనుకున్నాము కానీ వైసిపి ప్రభుత్వం తొలిరోజు నుంచే విధ్వంసకర పాలన మొదలుపెట్టిందనీ చంద్రబాబు విమర్శించారు. ప్రజలకు నష్టం, కష్టం కలుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా చూస్తూ కూర్చోలేమనీ, బాధితుల పక్షాన అటు న్యాయపోరాటం, ఇటు రాజకీయ పోరాటం చేస్తున్నామనీ ఆయన పేర్కొన్నారు.