అమరావతి: ప్రజా చైతన్యం ద్వారానే ఈ ప్రభుత్వనికి బుద్ది చెబుతామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. రాజధాని పర్యటన సమయంలో ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ రాజధాని కోసం లక్షా తొమ్మిదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టామని చెప్పారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలనుకున్నామనీ కానీ వైసిపి ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మానుష్యంగా మారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయిదు కోట్ల ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతిపై మంత్రులు నీచంగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సభ్యత, సంస్కారం లేని వ్యక్తులు ఏమైనా మాట్లాడతారనీ, తమకు సంస్కారం అడ్డువస్తుందన్నారు. ఈ రాజధాని సంపద సృష్టిస్తుందా లేదా, లక్షలాది మంది నిరుద్యోగ యువతకు, భావితరాలకు ఉపయోగపడుతుందా లేదా చూడాలని అన్నారు. హైదరబాద్ను అభివృద్ధి చేయడం వల్ల 60 నుండి 70 శాతం ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి వస్తోందని చంద్రబాబు వివరించారు. మంత్రులు బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ముఖ్యమంత్రి కుట్ర, కుతంత్రాలు చేసి రాజధానిని పూర్తిగా దెబ్బతీయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
‘మా కంటే ఇంకా మెరుగ్గా పరిపాలన చేస్తారని మిమ్నల్ని ప్రజలు ఎన్నుకుంటే మీరు ఏమి చేస్తున్నారు.’ అని చంద్రబాబు నిలదీశారు.బయట వాళ్లను తీసుకువచ్చి తన కాన్వాయ్పై రాళ్లు, చెప్పులు వేయించడం నీచమైన చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. రాజధానిపై సిఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. టిడిపి ఎంపిలు పట్టుబట్టడం వల్లే దశ చిత్రపటంలో ఏపి రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించిందని చంద్రబాబు అన్నారు. 22 మంది ఎంపిలు ఉన్న వైసిపి ఏమి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, క్వార్టర్స్ నిర్మాణం వైసిపి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.