కర్నూలు: ఇది ప్రజా ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం కాదనీ, విధ్వంసక ప్రభుత్వమని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. కర్నూలులో సోమవారం జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. పోలీసుల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత టిడిపి కార్యకర్తలపై 690 కేసులు పెట్టారనీ, ఎన్నో దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీని కార్యకర్తలే నడిపిస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం పురోగతి సాధించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉండి కూడా బాబాయ్ని ఎవరు హత్య చేశారో చెప్పలేకపోతున్నారని విమర్శించారు.
ఇన్నేళ్ల తన రాజకీయ అనుభవనంలో ఒక విచిత్రమైన నాయకుడిని ఇప్పుడే చూస్తున్నామని సిఎం జగన్ను ఉద్దేశించి పరోక్షంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ హయాంలో కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టున్నీ పూర్తి చేశామని చెప్పారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ఒక తట్ట మట్టి తీశారా, ఒక యూనిట్ పని చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎప్పటికైనా రాయలసీమ బాగుపడాలంటే గోదావరి నీళ్లు రావాలనీ, దీని కోసం ప్రభుత్వం పని చేస్తే తాము కూడా పూర్తిగా సహకరిస్తామనీ ఆయన అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక అందించామని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వంలో లారీ ఇసుక ధర మూడు రెట్లు పెరిగిందన్నారు. సిఎం జగన్ వైఖరితో రాష్ట్రంలో పెట్టుబడులు అన్నీ వెనక్కు వెళ్లిపోతున్నాయని చంద్రబాబు ఆరోపించారు.