పొలిటికల్ మిర్రర్
సీన్- 1 : సీఎం జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా కేంద్ర పెద్దలను కలుస్తున్నారు…! వీరి మధ్య రాజకీయ చర్చ జరుగుతుందా..? రాష్ట్ర బాగుకి చర్చ జరుగుతుందా..? అందరినీ వరుసగా కలుస్తున్నారు. ఎందుకో, విషయం ఏమిటో దీని గురించి లోతుగా తెలుసుకునేలోగా…..!!
సీన్ – 2: మండలి రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడం… సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై మండలి కార్యదర్శికి, చైర్మన్ కి సైలెంట్ యుద్ధం జరుగుతుంది. వ్యవహారం కోర్టుకి వెళ్లేలా ఉంది. ఈ విషయం కాస్త లోతుగా వెళ్ళేలోగా….!!
సీన్ -3 : సీనియర్ ఐపీస్ ఏబీ వెంకటేశ్వరరావుని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ అతన్ని పక్కన పెడుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన క్యాట్ ని ఆశ్రయించారు. ఇది విచారణలో ఉంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోగా…..!!
సీన్ – 4 : బాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు జరిగాయి. పలువురు టిడిపి నేతల ఇళ్లలోనూ జరిగాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా జరిపిన ఐటీ దాడుల్లో రూ. 2 వేల కోట్ల వరకు లెక్కల్లో లేని సొమ్ముని గుర్తించినట్టు ఐటీ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేసారు. ఇది టీడీపీ అవినీతికి టీజర్ అని వైసీపీ నాయకులు వరుసగా చెప్పుకొస్తున్నారు. అవినీతికి అంబాసిడర్ లాంటి జగన్ పని ఇదంతా అంటూ టిడిపి తిప్పికొడుతుంది. దీనిపై మరి కాస్త లోతుగా వెళ్ళేలోగా….!!
సీన్ – 5 : రాష్ట్రంలో గ్రానైట్ క్వారీలపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా రూ. వందల కోట్లు జరిమానాలు వేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ క్వారీకి రూ. 303 కోట్లు, బిజెపి నాయకుడు (ఒకప్పుడు టిడిపి పెద్ద) గరికపాటి మోహనరావు క్వారీకి రూ. 286 కోట్లు, మాజీ మంత్రి సిద్దా రాఘవరావు క్వారీకి రూ. 300 కోట్లకు పైగా జరిమానా వేశారు. ఏంటి ఇన్ని వందల కోట్లు దోచుకున్నారా… అసలు ఏం జరిగింది అని తెలుసుకునే లోగా….!
సీన్ – 6 : రాజధాని తరలింపు నెమ్మదిగా జరిగిపోతుంది. చాపకింద నీరులా చకచకా కొన్ని విభాగాలను తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉగాది వెళ్లిన వెంటనే కొన్ని కీలక శాఖలు విశాఖ నుండే కార్యకలాపాలు నిర్వహిస్తాయని అంటున్నారు. మరోవైపు రాజధాని అమరావతి సమీప గ్రామాల్లో భూములిచ్చిన రైతుల ఆందోళనలు ఆగడం లేదు. దీనిపై దృష్టి పెట్టి లోతుగా తెలుసుకునెలోగా….!!
రాష్ట్ర రాజకీయ తెరపై వరుసగా ఒకదానికొకటి రాజకీయ సీన్లు జరిగిపోతున్నాయి. కొన్ని ప్రభుత్వ పరిపాలన సంబంధిత సీన్లు కావచ్చు, కానీ అంతర్గత కారణం మాత్రం రాజకీయమే. వీటిలో కొన్ని సీన్లలో వైసీపీది పైచేయి కావచ్చు. కొన్ని సీన్లలో టీడీపీది పైచేయి కావచ్చు. కానీ ఈ విషయాలేవి తెగట్లేదు. ఇప్పుడే తెగేలా లేవు. కోర్టులు కూడా ఇప్పడే ఏమి తేల్చే స్థితిలో లేవు. పాపం ఏపీలో మొత్తానికి రాజకీయ ఆసక్తి ఉన్న వారికి ఈ సీన్లు మెదడుకి పని పెడుతున్నాయి. బాహ్య పొలిటికల్ తెరపై ఈ సీన్లు చాలవన్నట్టు బయటకు కనిపించకుండా తెర చాటున కొన్ని సీన్లు జరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్, బిజెపి మైత్రిలో లోలోపల బిజెపి నేతలు కొందరు రగులుతున్నట్టు వార్తలు వస్తుండడం…, పవన్ ని ఎదుర్కోడానికి వైసీపీ చిరంజీవిని రంగంలోకి దించాలని ప్లాన్ వేయడం వంటి రాజకీయ పుకార్లు ఊపందుకున్నాయి. మొన్ననే ఎన్నికలు ముగిసిన ఢిల్లీలోనూ ఇంత రాజకీయ వేడి లేదు. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ ఇంత రాజకీయ పొయ్యి రగలడం లేదు. ఏపీలో మాత్రం చకచకా ఈ పరిణామాలన్ని పరుగెత్తుతున్నాయి. చూద్దాం.. ఒక్కో అంశంపై ఏం జరుగుతుందో, ఎటు వెళ్తుందో…, దేనికి దారి తీస్తుందో చూద్దామనే ధోరణిలో సగటు రాజకీయ అభిమాని ఉన్నారు.
శ్రీనివాస్ మానెం