(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసిపి 151 సీట్లతో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టింది. 25 లోక్సభ సీట్లకు గాను ఏకంగా 23 స్థానాల్లో ప్రజలు వైసిపి అభ్యర్ధులకు పట్టం కట్టారు. ఇంత భారీ విజయం సాధించిన వైసిపి ఆరు నెలలు తిరగకముందే అభద్రతా భావనకు లోనవుతోందా.
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, హోంశాఖ మంత్రి అమిత్ షాను కొందరు ఎంపీలు విడివిడిగా కలుస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినదగ్గర నుంచీ ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అవి ఎంతవరకూ వెళ్లాయంటే వైసిపి ఎంపీలు కొందరు బిజెపిలోకి ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
మొదట జగన్ ఆగ్రహానికి గురయిన ఆ ఎంపీ ఎవరు అన్న ప్రశ్నపై చర్చ నడిచింది. తర్వాత వైసిపి ఎంపీలు ఎవరెవరు బిజెపితో టచ్లో ఉన్నారన్న అన్వేషణ మొదలయింది. చివరికి ఎవరెవరు బిజెపిలోకి జంప్ చేయనున్నారన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
ముందు ముగ్గురు ఎంపీలు ఫిరాయించనున్నారని వినబడింది. తర్వాత అ సంఖ్య క్రమేపీ పెరుగుతూ పోయింది. తాజాగా లోక్సభలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మాతృభాష విషయంలో మాట్లాడిన తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి మళ్లీ ఆగ్రహించారన్న వార్తలు కూడా ఆ వెంటనే జత కలిశాయి.
మంగళవారం ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారన్న వార్తలు కూడా గమనించదగ్గవే. వైసిపిలో నాయకత్వం వైఖరి పట్ల ఎవరైనా గానీ అసంతృప్తి వ్యక్తం చేయడం అరుదు. పార్టీలో నాయకత్వం అంటే జగన్ ఒక్కరే కాబట్టి అసంతృప్తి వ్యక్తం చేయడం అంటే జగన్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తపరచడమే. దీనికి ఎంపీలు సిద్ధపడ్డారంటే కాస్త ఆలోచించాల్సిందే.
లోక్సభలో మాతృభాష అభివృద్ధి విషయంలో మాట్లాడినందుకు ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నారన్న వార్తలు రాగానే రఘరామకృష్ణంరాజు స్పందించడం కూడా ఆశ్చర్యం కలిగించే విషయమే. మొదటిది జగన్ ఆగ్రహంగా ఉన్నారన్న మాట మీడియాలో వచ్చిందే తప్ప అధికారికంగా తెలిసిన విషయం కాదు. అలాంటిది రఘరామకృష్ణంరాజు మౌనంగా ఉండకుండా చాలా స్వేచ్ఛగా ఆంధ్రజ్యోతితో తన వివరణ పంచుకున్నారు. ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడడమూ వింతైన విషయమే. ఇదంతా చూస్తే వైసిపిలో ఏదో వ్యవహారం నడుస్తోందన్న అనుమానం బలపడుతోంది.