కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం శంఖుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రిని కలిసిన బిజెపి ఎంపీ సిఎం రమేష్
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కథ కూడా మలుపులు తిరుగుతున్నది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సున్నపురాళ్లపల్లి దగ్గర కడప ఉక్కుకు శంఖుస్థాపన చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైలవరం దగ్గర కడప ఉక్కుకు శంఖుస్థాపన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కడప ఉక్కుకు కేంద్రప్రభుత్వం నుంచి సహకారం ఆశించిన చంద్రబాబు దీర్ఘకాలం పాటు ఎదురు చూశారు. మధ్యలో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కడప ఉక్కు కోసం దీక్ష కూడా మొదలుపెట్టారు.
చివరికి చంద్రబాబు కేంద్రం సహకారం లేకుండా కడప ఉక్కు నిర్మిస్తామంటూ మైలవరం సమీపంలో కంబాలదిన్నె దగ్గర ఉక్కు కర్మాగారానికి శంఖుస్థాపన చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత జగన్ దానితో తనకు నిమిత్తం లేదని కొత్తచోట శంఖుస్థాపన చేశారు.
నిజానికి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్కు శంఖుస్థాపన చేశారు. బళ్లారి మైనింగ్ కుభకోణం నిందితుడు గాలి జనార్దన రెడ్డి ఈ కర్మాగారం నిర్మాణానికి సంకల్పించారు. దానికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇనుప ఖనిజం భూములు కూడా ఇచ్చింది. వైఎస్ మరణానంతరం చోటు చేసుకున్న మార్పులలో ఆ కర్మాగారం పని ఆగిపోయింది. అప్పటికే దానిపై దాదాపు 1300 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేశారు. దాని పునరుద్ధరణ విషయంలో ఎవరూ మాట్లాడడం లేదు. బ్రాహ్మణి స్టీల్స్ గురించి జగన్ ఇంతవరకూ నోరు మెదపలేదు.