(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గుంటూరు: ఏపికి మూడు రాజధానులంటూ సిఎం జగన్ చేసిన ప్రకటన రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ముఖ్యమంత్రులు మారితే రాజధానిని మారుస్తారా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మందడం గ్రామంలో రాజధాని ప్రాంత రైతులు ఆందోళనకు దిగి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంలో రైతులు మాట్లాడుతూ..అమరావతి నిర్మాణానికే డబ్బులు లేవంటున్న ప్రభుత్వం మూడు రాజధానులు కట్టడానికి డబ్బులు ఎలా తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు రాజధాని మార్పు ప్రకటన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన పరిస్థితి రైతుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటున్న జగన్ ఏపిలో ఆఫ్రికా సంస్కృతి తీసుకొస్తారా అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ప్రతి ఏటా తుఫానులతో విశాఖ ఎంతో నష్టపోతున్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. అమరావతిలో పది నగరాలు అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత రైతులు డిమాండ్ చేశారు.