(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఏపి రాజధాని అమరావతి అంశంపై 24 రోజులుగా పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన నిర్వహిస్తున్నా తెలుగు సినీ పరిశ్రమ నుండి ఎవరూ ముందుకు రాకపోవడంతో జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన పోరాట సమితి ఆధ్వర్యంలో టాలీవుడ్ ప్రముఖ నటుల ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా నాలుగు డిమాండ్లతో ఈ పోరాట సమితి నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ డిమాండ్లపై తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు స్పందించాలని పోరాట సమితి అధ్యక్షుడు షేక్ జిలానీ కోరుతున్నారు.
శుక్రవారం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటి ముందు సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ఏపికి చెందిన సినీ హీరోలు స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19వ తేదీ వరకూ హీరోల ఇంటి ముందు ఆందోళనలు చేస్తామని ఆయన తెలిపారు. శనివారం 11వ తేదీ అల్లు అర్జున్ ఇంటి ముందు, 12వ తేదీ మెగాస్టార్ చిరంజీవి, 13న నందమూరి బాలకృష్ణ, 14న జూనియర్ ఎన్టిఆర్, 15న మోహన్బాబు, 16న మా అధ్యక్షుడు నరేష్, 18న అక్కినేని నాగార్జున, 18న వెంకటేష్ ఇళ్ల ముందు నిరాహార దీక్షలు చేస్తామని ప్రకటించారు.
డిమాండ్లు
- ఏపికి కేంద్రం ప్రత్యేక హోదా కల్పించాలి
- వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక మండళ్లు ఏర్పాటు చేయాలి.
- కర్నూలులో హైకోర్టు, అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేయాలి.
- ఏపి పునర్విభజన చట్టంలోని విభజన హామీలను అమలు చేయాలి.