అమరావతి: టిడిపి సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణంపై వైసిపి, టిడిపి నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. వైసిపి ప్రభుత్వం వేధింపులకు గురి చేయడం వల్లనే ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని టిడిపి నేతలు ఆరోపిస్తుండగా టిడిపిలో ఆయనకు జరిగిన అవమానాలే కారణమనీ, టిడిపి శవ రాజకీయాలు చేస్తోందనీ వైసిపి నేతలు విమర్శిస్తున్నారు.
కోడెలది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్య అంటూ టిడిపి అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కోడెల మృతిపై వైసిపి నీచ శవరాజకీయాలు చేస్తున్నదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. జగన్ను ఉద్దేశిస్తూ నీచ రాజకీయాల్లో మీకు మీరే సాటని మరో సారి నిరూపించుకున్నారని లోకేష్ విమర్శించారు. మీ శకుని మామ విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో కంచేటి సాయి అనే తోలుబొమ్మని అడ్డం పెట్టుకొని విదేశాల్లో ఉన్న కొడెల కుమారుడే ఈ ఆత్మహత్యకి కారణమని కేసు పెట్టించారని లోకేష్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ జగన్తో కంచేటి సాయి ఉన్న ఫోటోను ట్యాగ్ చేశారు.
కోడెల మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయనీ, వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఒత్తిడివల్లే కోడెల ఉరి వేసుకున్నారనీ టిడిపి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బొత్సా పేర్కొంటూ ప్రభుత్వం ఆయనపై కావాలని ఏ కేసులు పెట్టలేదనీ, కోడెల వల్ల నష్టపోయిన బాధితులే పోలీసులను ఆశ్రయించడం వల్ల కేసులు నమోదు అయ్యాయయనీ చెప్పారు.
కోడెల మృతికి వైసిపి నేతలు, ప్రభుత్వం, పోలీసులు, సాక్షి మీడియానే కారణమని టిడిపి నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. విదేశాల్లో ఉన్న కొడుకే చంపాడని వైసిపి నేత సాయితో ఫిర్యాదు చేయించారని యనమల అన్నారు. బొత్స వ్యాఖ్యలు, సాయి ఫిర్యాదు చూస్తే రెండు ఒకే రకంగా ఉన్నాయని యనమల పేర్కొన్నారు. వైసిపి నేతల కుట్రను ఇవన్నీ బహిర్గతం చేస్తున్నాయని యనమల అన్నారు. కోడెలది ఆత్మహత్య అని ఫొరెన్సిక్ నివేదికలో ధృవీకరించారనీ, దీనిపై జగన్, వైసిపి నేతలు
ఏమి సమాధానం చెబుతారని యనమల నిలదీశారు. కోడెల బలన్మరణానికి వైసిపి నేతలే బాధ్యత వహించాలని యనమల అంటుండగా కోడెల మృతిపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారనీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. మూడు నెలల కాలంలో కోడెలను చంద్రబాబు ఒక్క రోజు కూడా పరామర్శించలేదనీ, అందుకే ఆయన మానసిక ఆందోళనకు గురి అయ్యారనీ నాని అన్నారు. కోడెల మంత్రి పదవి కావాలంటే ఇవ్వకుండా చంద్రబాబు స్పీకర్ పదవి ఇచ్చారనీ, నర్సరావుపేట టికెట్ ఇవ్వమంటే సత్తెనపల్లి ఇచ్చారనీ, సీనియర్ అయిన ఆయన్ను కాదనీ జూనియర్లకు మంత్రి పదవులు కట్టబెట్టారనీ, ఇప్పుడేమో ఆయనపై ఎంతో ప్రేమ ఉన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని కొడాలి అన్నారు. కొడాలి వ్యాఖ్యలపై టిడిపి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పందిస్తూ స్పీకర్ పదవి అనేది ఉన్నతమైనదని పేర్కొన్నారు. స్పీకర్ పదవి ఇవ్వడం అవమానించడం ఎందుకవుతుందని డొక్కా ప్రశ్నించారు. అయితే స్వీకర్ పదవి తమ్మినేనికి ఇచ్చిన వైసిపి ఆయనను అవమానించినట్లేనా అని డొక్కా అన్నారు. స్పీకర్ పదవిని తక్కువగా చేసి మాట్లాడిన కొడాలి దీనిపై సమాధానం చెప్పాలని డొక్కా డిమాండ్ చేశారు.
టిడిపిలో ఎదురైన అనేక అనుమానాలతోనే కోడెల తీవ్ర మనోవేదనకు గురయ్యారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గత రెండు నెలలుగా కోడెల అనారోగ్యంతో బాధపడుతున్నా చంద్రబాబు కనీసం పరామర్శించలేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఛలో ఆత్మకూరుకు కోడెల వస్తానంటే టిడిపి నేతలు ఆయన్ను అడ్డుకున్నారనీ, వర్ల రామయ్య కూడా ఆయనపై అనేక ఆరోపణలు చేశారనీ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ శవరాజకీయాలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక పక్క కోడెల ఆత్మహత్య చేసుకుంటే నిసిగ్గుగా వైసిపి నేతలు మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు చేయడం ప్రారంభించారని టిడిపి మహిళా నేత పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. శవరాజకీయాలు చేయడం వైసిపికే అలవాటని అనురాధ విమర్శించారు.
కోడెల మృతికి వైసిపి వేధింపులే కారణమని పల్నాడుకు చెందిన సీనియర్ టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. ఇలా మరి కొందరు వైసిపి, టిడిపి నేతలు మీ వల్లే అంటే కాదు మీ వల్లే అంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.