(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలనాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డంకులు తొలగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ముచ్చటగా మూడవ సారీ తమకు రాష్ట్రాల రాజధానులతో సంబంధం లేదంటూ స్పష్టం చేసింది. సిఆర్డిఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన తరువాత హైకోర్టులో అమరావతి వ్యాజ్యాలు నడుస్తున్న నేపధ్యంలో ఈ నెల 21వ తేదీ వరకూ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 21 తరువాత హైకోర్టులో రోజు వారి విచారణ జరుగుతుందటంతో త్వరలోనే తీర్పు వచ్చే అవకాశం ఉంది.
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టులు కల్పించుకోవని పలువురు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే మూడు రాజధానుల వ్యవహారంలో ఉన్న చిన్న మెలికను తొలగిస్తే సమస్య సులువుగా పరిష్కారం అవుతుందని అంటున్నారు. శాసన రాజధాని, పరిపాలనా రాజధానులను ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. హైకోర్టు ఏర్పాటు రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జరిగింది కావడం వల్ల న్యాయ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదు. ఇప్పటి వరకూ ఈ విషయాన్ని ప్రతిపక్షాలు, ఇతర సంఘాలు వాదిస్తున్నాయి.
ఒక వేళ హైకోర్టు మార్పు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం కేంద్రానికి పంపితే అదీ కేంద్రానికి సమ్మతం అయితే రాష్ట్రపతి ద్వారా ఆమోదం లభిస్తుంది. ఇదంతా లాంగ్ ప్రొసెస్. ఇప్పటికిప్పుడు మూడు రాజధానుల ప్రక్రియ పూర్తి చేయాలంటే జగన్మోహనరెడ్డి సర్కార్ కర్నూలుకు న్యాయ రాజధాని బదులు శాసన రాజధాని తరలించడానికి పూనుకుంటే కోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు జోలి (తరలింపు)కి పోకుండా పరిపాలనా సంబంధమైన విషయాలపై ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కోర్టులు అభ్యంతరం వ్యక్తం చేయవనే మాట కూడా వినిపిస్తోంది.
మూడు రాజధానుల విషయంలో ఈ మోడిఫికేషన్లు చేసే ప్రక్రియలో భాగంగానే అమరావతిలో శాసన రాజధాని ఉండదు అన్నట్లుగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హైకోర్టు తరలింపు అనేది రాష్ట్రపరిధిలోని అంశం కాదు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకుని ఉంటే సమస్య ఉత్పన్నం అయ్యేది కాదనీ, అలా జరగకపోవడం వల్లనే ఉన్న సాంకేతిక అంశాల కారణంగా వ్యవహారం వివాదం అయ్యిందనీ అనుకుంటున్నారు. విశాఖకు పరిపాలనా రాజధాని అనేది కన్ఫర్మ్ కాగా కర్నూలుకు న్యాయ రాజధానా లేక శాసన రాజధానా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనున్నది.