రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం శాసన సభలో ఆమోదించిన సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదం కొరకు పంపింది. దీనిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇంత వరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. ఇది ఇలా ఉండగా అమరావతి నుండి రాజధానిని తరలించడానికి వీలులేదంటూ అమరావతి ప్రాంత రైతులతో పాటు మరి కొందరు దాఖలు చేసిన పిటిషన్ లు ఏపి హైకోర్టు విచారణలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే రాజధాని విషయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వం లోని నిపుణుల కమిటీ, హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికలను సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే టీ శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా. నిపుణుల కమిటీ నివేదికల పై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకె మల్లేశ్వరి, జస్టిస్ బి కృష్ణమోహన్ లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే రాజధానితో ముడిపడిన వ్యాజ్యాల విచారణ త్రిసభ్య ధర్మాసనం ముందు ఆగస్టు 6న ఉన్న కారణంగా ఈ వ్యాజ్యాన్ని కూడా వాటితో జత చేయాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది.
ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదికనూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం పరిశీలించి విచారణ జరుపనుండటం తో..కమిటీ నివేదిక లో ఏముందో, రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టు ఏమి చేస్తుందో, ఏమి చెబుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది.