(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: పేద రాష్టమైన ఆంధ్రప్రదేశ్కు శాసనమండలి అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించడంపై పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పందించారు. శాసనసభలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల నియంత్రణ కోసమే శాసనమండలి (పెద్దల సభ) అని తులసిరెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదిన కానుకగా రాష్ట్రంలో 2004 జూలై ఎనిమిదవ తేదీన శాసనమండలిని పునరుద్ధరించారని గుర్తు చేశారు. ఆర్టికల్ 169 క్లాస్ 1 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే చట్టం అవ్వదనీ, శాసనమండలి పార్లమెంట్ నిర్ణయం ప్రకారం రద్దు అవుతుందన్న విషయం జగన్కు అర్థం కాలేదనీ వ్యాఖ్యానించారు.
సిఎం ఎక్కడ ఉంటే అక్కడి నుండి పరిపాలన చేయవచ్చు, పేద రాష్ట్రానికి మండలి అవసరమా అని ప్రశ్నిస్తున్న జగన్కు తులసి రెడ్డి సూటి ప్రశ్న సంధించారు. రాజధానికి సంబంధించి రైతులు, మహిళల పిటిషన్లకు వ్యతిరేకంగా వాదించడానికి అయిదు కోట్ల రూపాయలు వెచ్చించి న్యాయవాదిని పెట్టుకోవడం అవసరమా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. శాసనమండలిలో బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపితే మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పెద్దల సభ ఎప్పుడూ అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఎటువంటి నిర్ణయాలు చేయలేదని తులసిరెడ్డి పేర్కొన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ పెద్దల సభలోని వాళ్ళు తాబేదార్లు అని విమర్శించడం శాసనమండలి చరిత్రకు కళంకం అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చారిత్రక తప్పిదాలను చేసి చరిత్ర హీనులు కావద్దని తులసిరెడ్డి హితవు పలికారు.