అమరావతి: ఏపీలో పెరిగిన బస్సు ఛార్జీలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్కు 10 పైసలు పెంచారు. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు పెంచారు. ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. వెన్నెల స్లీపర్ బస్సుల్లో మాత్రం చార్జీలు పెంచలేని ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సిటీ బస్సులకు సంబంధించి 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపు లేదని, పల్లెవెలుగు బస్సుల్లో మొదటి 2 స్టేజీలు లేదా 10 కిలోమీటర్ల వరకు చార్జీల పెంపుదల వర్తించదని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. డీజిల్ ధర గత నాలుగేళ్లలో లీటర్ ఒక్కింటికి రూ.49 నుంచి రూ.70కి చేరిందని వెల్లడించింది. డీజిల్ ధర పెంపు కారణంగా సంస్థకు ఏటా రూ.630 కోట్ల నష్టం వస్తోందని వివరించింది. బస్సుల విడిభాగాలు, సిబ్బంది జీతాలు, ఇతర అలవెన్సుల కారణంగా మరో రూ.650 కోట్ల మేర భారం పడుతోందని తెలిపింది.
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడాలంటే ఛార్జీలు పెంచడం తప్పనిసరి అని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీఎస్ ఆర్టీసీకి మొత్తం రూ.6735 కోట్ల అప్పు ఉందని ఇటీవలే మంత్రి పేర్ని నాని చెప్పారు. బ్యాంకులు, వివిధ సంస్థల నుంచి తెచ్చిన అప్పులు రూ.2995 కోట్లు ఉంటే, ఇతరత్రా బకాయిలు అన్నీ కలిపి రూ.3,740 కోట్లు అయ్యాయన్నారు. డీజిల్ ధరల పెరుగుదల వల్ల కూడా ఆర్టీసీపై భారం ఉంది. 2015లో డీజిల్ ధరలు లీటర్ సుమారు రూ.50 ఉంటే, ఇప్పుడు లీటర్ రూ.70 వరకు చేరిందన్నారు. డీజిల్ ధరల పెరుగుదల వల్ల సంస్థ మీద ఏటా సుమారు రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు భారం పెరుగుతోందన్నారు. ఆ నష్టాలను నివారించేందుకు, ఆర్టీసీకి జీవం పోసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 2015 తర్వాత ఆర్టీసీ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు.
ఇటీవల తెలంగాణ ఆర్టీసీ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అన్నీ సర్వీసులపై 20 పైసలు పెంచింది. సంస్థ నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఆర్టీసీ చార్జీలను పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ చార్జీల పెంపు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బాటనే ఏపీ సీఎం జగన్ ఎంచుకున్నారు. చార్జీల పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి ఏటా రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టాలు వస్తున్నా.. నాలుగేళ్లుగా చార్జీలు పెంచలేదు. భారీ నష్టాలు, పెరుగుతున్న డీజల్ ధరల నేపథ్యంలో చార్జీలు పెంచాలని ఆర్టీసీ ఎప్పటి నుంచో కోరుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తరహాలో ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచాలని నిర్ణయించింది.