వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దాదాపు 60 కి పైగా నిర్ణయాలను హైకోర్టు తప్పు పట్టిన విషయం తెలిసిందే. ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి కోసం సి ఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నా వాటిలో కొన్ని చట్ట పరిధిలో లేకపోవడంతోనో, కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు సమర్ధవంతంగా వాదనలు వినిపించలేకపోవడం తోనో, పిటిషినర్ల వాదనలో బలం ఉండటం చేతనో కోర్టుల్లో నిలబడలేకపోతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలపై ముందడుగు పడలేని పరిస్థితి. ఈ పర్యాసనాల కారణంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఇరుకున పడటం, అభాసుపాలయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది.
ఈ నేపథ్యంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలలో మంత్రులు నిమిత్తమాత్రులు వారిని తప్పు పట్టడం అనవసరం అని వ్యాఖ్యానించారు. ప్రధానంగా దీనికి బ్యూరోక్రసీదే బాధ్యతగా పేర్కొన్నారు తులసిరెడ్డి. ఐ ఏ ఎస్ గా ఎంపిక అయ్యారు అంటేనే వారిని చాలా మేధావులుగా కీర్తించడం జరుగుతుందని అలాంటిది వారు దాదాపు 20, 25 సంవత్సరాల సీనియారిటీకి వచ్చి వారు చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నించారు.
ముఖ్య మంత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాటి వల్ల వచ్చే ఇబ్బందులు, పర్యవసానాలు వివరించి సరి చేయాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తదితర సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు డూడూ బసవన్న మాదిరిగా తల ఊపడం వల్లే ఈ పరిస్థితిలు ఎదురవుతున్నాయి అంటున్నారు తులసిరెడ్డి. వీటిలో ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో సీనియర్ ఐ ఏ ఎస్ లకు అంటే బాధ్యత ఉంటుందన్నారు. రాజ్యాంగ బద్దంగా, చట్టబద్ధంగా లేని నిర్ణయాల విషయంలో ధైర్యంగా చెప్పలేనప్పుడు వారు ఆ పదవుల్లో కొనసాగడం కంటే రాజీనామా చేయడం మంచిది అని అయన అభిప్రాయపడ్డారు. తులసి రెడ్డి వ్యాఖ్యలపై ఐఏఎస్ లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
పీ పీ ఏల సమీక్ష, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయం, ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా భోధన, ఆవ భూముల్లో ఇళ్ల పట్టాల పంపిణీ తదితర అంశాల్లో ఇప్పటికే కోర్టుల నుండి ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు రాగా మూడు రాజధానుల అంశం, విశాఖలో 30 ఎకరాల్లో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం ఇలా మరి కొన్ని కోర్టు విచారణలో ఉన్నాయి అనేది తెలిసిందే కదా.