శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో భారత ఆర్మీ దాడులు చేపట్టింది. తాంగ్ధర్ సెక్టార్కు ఎదురుగా ఉండే నీలం లోయలోని నాలుగు ఉగ్రశిబిరాలపై భారత బలగాలు దాడి చేశాయి. శతఘ్నులతో చేసిన ఈ దాడిలో దాదాపు 15 మంది ఉగ్రవాదులు, నలుగురు పాకిస్తాన్ జవాన్లు హతమైనట్లు సమాచారం. పాక్ ఆర్మీ పోస్టులు సైతం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. నాలుగు క్యాంపులు నేలమట్టమైనట్లు సమాచారం. బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు చేపట్టిన తర్వాత చేస్తున్న దాడులివి కావడం విశేషం. బాలాకోట్ దాడులతో పాక్ సైన్యం సాయంతో పీవోకేలో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం భారత సైనికులే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో పీఓకేలో ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టాయని భారత సైన్య ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఓ వైపు కాల్పులు జరుపుతూ.. మరోవైపు నుంచి ఉగ్రవాదులను భారత్లోకి చొరబడేలా చేస్తుండటాన్ని భారత ఆర్మీ గుర్తించింది. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ.. పాక్ ప్రేరేపిత ఉగ్ర స్థావరాలపై దాడులకు దిగింది. కశ్మీర్కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరిన్ని దురాగతాలకు పాల్పడుతోంది. వారం రోజుల వ్యవధిలో పాక్ సైన్యం బరితెగింపుల వల్ల నలుగురు సైనికులు అమరులయ్యారు. సరిహద్దుల్లో నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో సరిహద్దుల వద్ద హైఅలర్ట్ కొనసాగుతూనే ఉంది. అయితే సరిహద్దుల వెంట డ్రోన్లతో కూడా దాడులు చేసేందుకు పాక్ కుట్రలు పన్నుతోంది. ఇటీవల పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లో వీటి ఉనికిని కూడా గుర్తించారు. తాజగా రక్షణ స్థావరాలపై కూడా దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్లాన్లు వేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో.. పంజాబ్, కశ్మీర్లోని రక్షణ స్థావరాల వద్ద అలర్ట్ ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 2050సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనల్లో 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.