(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారతీయ జనతా పార్టీ ఒకే నెలలో ఇద్దరు కీలకమైన నేతలను కోల్పోయింది. కష్టసమయంలోనూ పార్టీకి అండగా ఉంటూ.. వివిధ దశల్లో పనిచేసి పార్టీ ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన ఇద్దరు మహా నేతలను సుష్మా స్వరాజ్ అరుణ్ జైట్లీలను కేవలం 18 రోజుల వ్యవధిలోనే పోగొట్టుకుంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మా ఈ నెల 6న గుండెపోటుతో మృతి చెందగా… కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడిన అరుణ్ జైట్లీ ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. జైట్లీ విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగారు. జయప్రకాశ్ నారాయణ్కి అనుచరుడిగా ఉన్నారు. జైట్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్షను కూడా జైట్లీ అనుభవించారు. బీజేపీలో ఎన్నికల వ్యూహాలు రచించడంలో జైట్లీ దిట్ట. లోక్సభ ఎన్నికలైనా, రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలైనా జైట్లీ పాత్ర ఉండాల్సిందే. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆయన.. పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. తనదైన వ్యూహాలతో చాలాచోట్ల పార్టీకి విజయం అందించేందుకు కృషిచేశారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి అమృత్ సర్ నుంచి జైట్లీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ బీజేపీ అధికారంలోకి రావడంతో జైట్లీ.. కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆ తర్వాత జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. అప్పటికే గుజరాత్ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న జైట్లీని 2018లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించింది బీజేపీ నాయకత్వం. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ విజయ ఢంకా మోగించి మళ్లీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినా.. జైట్లీ మాత్రం మోదీ కేబినెట్లో చేరలేదు. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న అనంతరం ఆయన కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు. ఆరోగ్య పరిస్థితి కారణంగా తాను కేంద్ర మంత్రివర్గంలో చేరడం లేదని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. కేంద్ర మంత్రిగా జైట్లీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. 2014 లో మోదీ సారధ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జీఎస్టీ అమలు బాధ్యతను జైట్లీపై పెట్టారు. పన్నులకు సంబంధించిన అతి ముఖ్యమైన బాధ్యతను ఆయనకు ప్రధాని మోదీ అప్పగించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఒకే తాటిపైకి తేవడంలో జైట్లీసఫలీకృతులయ్యారు. పన్నుల సంస్కరణకు పెద్దపీట వేయడంతో పాటు సుధీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జీఎస్టీని తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే విజయవంతంగా అమల్లోకి తెచ్చారు.