అశోక్ లావాసా చర్యతో ఈసీలో స్పందన
క్లీన్ చిట్ ఇవ్వడంపై మరోసారి పరిశీలన
న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో నీతి ఆయోగ్, ప్రధాని కార్యాలయాలకు క్లీన్ చిట్ ఇచ్చే విషయమై పునరాలోచించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ముగ్గురు కమిషనర్లలో ఒకరైన అశోక్ లావాసా తీవ్ర నిర్ణయమే ఇందుకు కారణమని ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పత్రిక తన కథనంలో ప్రచురించింది. గోండియా, వార్దా, లాతూర్ ప్రాంతాలకు సంబంధించిన సమాచార సేకరణలో పీఎంఓ నీతి ఆయోగ్ ను దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయగా, దాన్ని ఈసీ గత వారం కొట్టేసింది. ప్రధానమంత్రి తన అధికారిక, ఎన్నికల పర్యటనలు కలిపి చేయొచ్చని 2014 అక్టోబరు 7వ తేదీన చేసిన సూచనల ప్రకారం అందులో తప్పేమీ లేదని.. అందువల్ల ఫిర్యాదును కొట్టేస్తున్నామని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా మే 12న తెలిపారు. అయితే, ఈ విషయంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ను మరింత సమాచారం అడగాలని ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా అప్పటికే కోరినా, ఈలోపే క్లీన్ చిట్ ఇచ్చేశారు. గోండియా, వార్ధా, లాతూరు ప్రాంతాల సమాచారం కావాలని నీతి ఆయోగ్ నిజంగానే కోరిందా, ఆ సమాచారాన్ని ప్రధాని అక్కడ వాడుకున్నారా అనే విషయాలు చెప్పాలని ఆయన కోరారు. 2014 అక్టోబరు 7వ తేదీనే ప్రధానికి ఈ మినహాయింపు వచ్చిందంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ఈ ఫిర్యాదును కొట్టేశారు.
అయితే, వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా నిర్ణయిస్తారని లావాసా దీనిపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన అభ్యంతరం నేపథ్యంలో ఎన్నికల సంఘం అమితాబ్ కాంత్ కు గురువారం మరో లేఖ రాసింది. కలెక్టర్ల నుంచి సేకరించిన సమాచారాన్ని ప్రధాని ఎన్నికల ర్యాలీలలో వాడుకున్నారా అని అడిగింది. అయితే ఎప్పటిలోగా సమాధానం ఇవ్వాలో చెప్పలేదు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఈనెల 1న ఫిర్యాదుచేసింది. ఎన్నికల ప్రచారానికి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది.
అయితే, అమితాబ్ కాంత్ మాత్రం తామేమీ తప్పు చేయలేదన్నారు. వివిధ జిల్లాల సమాచారం సేకరించడం తమ విధుల్లో భాగమని చెప్పారు. దానిపైనే అశోక్ లావాసా మరింత సమాచారం కోరారు. పూర్తి వాస్తవాలు తెలియాలని ఆయన వాదించడంతో ఈసీ ఈ వారంలో అమితాబ్ కాంత్ కు మరో లేఖ రాసింది. అశోక్ లావాసా నిర్ణయాలను మిగిలిన కమిషనర్లు తోసిపుచ్చడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై వచ్చిన ఐదు ఫిర్యాదులను ఏకాభిప్రాయంతో కాక మెజారిటీ అభిప్రాయంతో కొట్టేశారు.