(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు సంతృప్తిగా పనిచేయడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. టీఎస్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని.. ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేశారు. యూనియన్లకు సంబంధించి రహస్య ఓటింగ్ పెట్టాలన్నారు. ఎక్కువ మంది అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. డిపోలలో రెండేళ్ల వరకు ఎన్నికలు వద్దని బలవంతంగా కార్మికుల దగ్గర సంతకాలు తీసుకుంటున్నారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. సంక్షేమ కౌన్సిల్లో సభ్యులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. హైదరాబాద్ లో 3500 బస్సుల్లో వెయ్యి బస్సులను తగ్గించి పని భారం పెంచుతున్నారని మండిపడ్డారు. బస్సులను కుదించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు.
మరోవైపు టీఎస్ ఆర్టీసీలో ఇంకా అసంతృప్తి సెగలు రగులుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలే 55 రోజులపాటు సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు.. సీఎం కేసీఆర్ ప్రకటనతో తిరిగి విధుల్లో చేరారు. ఆర్టీసీ సమ్మెకు ప్రధాన కారణం యూనియన్లే అంటూ సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో వెనక్కి తగ్గిన యూనియన్ నేతలు మరోమారు తమ గళం వినిపిస్తున్నారు.