గౌహతి: బీజేపీ ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఆ పార్టీ ద్వేషాన్ని వ్యాపి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. శనివారం ‘సేవ్ నేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్’ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా అస్సాంలోని గౌహతిలో జరిగిన సభలో రాహుల్ మాట్లాడారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అస్సాంతోపాటు దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయన్నారు. ఆందోళనకారుల్ని కాల్చి చంపుతున్నారని రాహుల్ ప్రశ్నించారు. ప్రజల గొంతును బీజేపీ వినడం లేదని మండిపడ్డారు. ఈశాన్యరాష్ట్రాల సంస్కృతి, చరిత్రను అణిచివేయాలని బీజేపీ నాయకులు అనుకుంటున్నారని ఆరోపించారు. అస్సామీ భాష, సంస్కృతిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అస్సాంను నాగపూర్ నడిపించదన్నారు. అస్సాంను అస్సామీలే పాలిస్తారని రాహుల్ తెలిపారు.
మరోవైపు మోదీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళన కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. సీఏఏపై దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనలు హింసత్మకంగా మారుతున్నాయి. అసోంలో జరిగిన నిరసనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది వరకు గాయపడ్డారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత అసోంలో నిరసనల వెల్లువెత్తిన విషయం తెలిసిందే.