బీజేపీ నుంచి ప్రాతినిధ్యం శూన్యం
ఎల్జేపీ నుంచి ఒక ముస్లిం ఎంపీ
న్యూఢిల్లీ: దేశలంలోని వోటర్ల జనాభాలో 14 శాతానికి పైగా ఉన్నా.. లోక్ సభలో ఈసారి ముస్లింల ప్రాతినిధ్యం 5 శాతం కంటే కూడా తక్కువగా ఉంది. అయితే, గత లోక్ సభ కంటే ఈసారి ఇద్దరు ముస్లిం ఎంపీలు ఎక్కువగా ఉన్నారు. ఇంతకుముందు 23 మందే ఉండగా ఈసారి 25కు వారి సంఖ్య పెరిగింది. మొత్తం 542 స్థానాలున్న సభలో 303 స్థానాలు గెలుచుకున్న బీజేపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా ముస్లిం ఎంపీలు లేరు. పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు ముస్లింలకు పార్టీ టికెట్లు ఇచ్చింది. 95 శాతం ముస్లిం జనాభా ఉన్న లక్షద్వీప్ లోనూ ముస్లింనే నిలబెట్టింది. కశ్మీర్ లోయలో ముగ్గురికి అవకాశం ఇచ్చింది. కానీ ఈ ఆరుగురిలో ఎవరూ విజయం సాధించలేదు.
ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీ కూటమి నుంచి ముగ్గురేసి చొప్పున ఆరుగురు ముస్లిం ఎంపీలు వచ్చారు. అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి ఐదుగురు టీఎంసీ, ఒక కాంగ్రెస్ ఎంపీలు ముస్లింలు. మజ్లిస్ నుంచి అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఔరంగా బాద్ లో గెలిచిన ఇంతియాజ్ జలీల్ సయ్యద్ కూడా గెలిచే అవకాశం కనిపిస్తోంది. అక్కడ శివసేన అభ్యర్థి చంద్రకాంత్ ఖైరేపై ఆయన నెగ్గేలా ఉన్నారు. మహారాష్ట్రలో ప్రకాష్ అంబేద్కర్ పార్టీతో కలిసి ఎంఐఎం పోటీ చేసింది.
వామపక్షాల తరఫున కేరళలోని అళప్పుళ నుంచి గెలిచిన ముస్లిం ఏఎం ఆరిఫ్ ఒక్కరే
. కేరళలో ఐయూఎంఎల్ కు చెందిన ఇద్దరు గెలిచారు. అదే పార్టీ నుంచి తమిళనాడులో ఒకరు ఆధిక్యంలో ఉన్నారు. కశ్మీర్ లోయలోని మూడు స్థానాలు నేషనల్ కాన్ఫరెన్స్ ఖాతాలో పడ్డాయి. ఆ పార్టీ నుంచి ఫరూక్ అబ్దుల్లా, మహ్మద్ అక్బర్ లోనీ, హనామీ మసూదీ గెలిచారు. కాంగ్రెస్ నుంచి నలుగురు ముస్లిం అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు.