(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పాకిస్తాన్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలతో పాల ధరలు పోటీ పడుతున్నాయి. మొహర్రం పర్వదినం సందర్భంగా పాకిస్థాన్ లోని ప్రధాన నగరాల్లో పాల ధరలు ఆకాశాన్నంటాయి. కరాచీ, సింధు ప్రావిన్స్ వంటి ప్రాంతాల్లో లీటరు పాలకు ఏకంగా రూ. 140 వరకు వసూలు చేశారు. పాకిస్థాన్లో పెట్రోల్ ధర కన్నా మించి పాల ధరలు పెరిగిపోవడం గమనార్హం. రెండ్రోజుల కిందట పాక్లో లీటరు పెట్రోల్కు రూ. 113, లీటరు డీజిల్కు రూ. 91 ధర ఉంది. మొహర్రం సందర్భంగా జరిగే ఊరేగింపులో పాల్గొనేవారికి సబీల్స్ (స్టాల్స్) ఏర్పాటుచేసి.. ఉచితంగా పాలు, పళ్లరసాలు, తాగునీరు అందిస్తారు. ఇలా సబీల్స్ కోసం పెద్ద ఎత్తున పాల డిమాండ్ ఏర్పడటంతో కరాచీలో పాల ధరలు అమాంతం చుక్కలనంటాయి.
డెయిరీ మాఫియా మొహర్రం రోజున పాల ధరలను మరింతగా పెంచి ప్రజలను దోచుకుందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. 9, 10 తేదీలలో వ్యాపారులు తమకు నచ్చిన ధరలకు పాలను విక్రయించారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించింది. పెరుగుతున్న పాల ధరలను నియంత్రించేందుకు పాల వ్యాపారులతో సమీక్ష నిర్వహించింది. పాల ధరను తగ్గించే ప్రయత్నం చేసింది.