(కర్నూలు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
జిల్లాలోని నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబ సామూహిక ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, హెడ్ కానిస్టేబుల్ను ఆదివారం అరెస్టు చేశారు. ఈ నెల మూడవ తేదీన అబ్దుల్ సలాం (45) అతని భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా జలందర్(10), కుమార్తె సల్మా (14)తో కలిసి గూడ్స్ రైలు కింద పడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బలవన్మరణం చేసుకునే ముందు అబ్దుల్ సలాం.. పోలీసుల వేధింపుల కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ విడుదల చేసిన సేల్ఫీ వీడియో శనివారం బయటకు వచ్చింది. ఈ దుర్ఘటనను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్రంగా పరిగణిస్తూ వెంటనే స్పందించారు. విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఆదేశించారు. దీంతో ఆయన ఐజీ శంఖబ్రత బాగ్చి, గుంటూరు అదనపు ఎస్పీ అరిఫ్ అఫీజ్ లను విచారణ అధికారులుగా నియమించారు.
ఐజీ శంఖబ్రత బాగ్చి, అరిఫ్ అఫీజ్ ఆదివారం నంద్యాల చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మృతుని బంధువులు అధికారులను కలిసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అబ్దుల్ సలాంపై దొంగతనం కేసు బనాయించి వేధించడం వల్లనే మనస్థాపానికి గురై కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపించారు. ఒక పక్క విచారణ జరుపుతూనే మరో పక్క ఆరోపణలను ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లను అరెస్టు చేశారు. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డిని శనివారమే సస్పెండ్ చేశారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఇప్పటికే డీజీపి గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.