ఢిల్లీ, జనవరి 10: రామ జన్మభూమి – బాబ్రీ మసీద్ స్థల వివాదంపై ఐదుగురు జడ్జిలతో ఏర్పడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ మొదలుకాకుండానే వాయిదా పడింది. ధర్మాసనంలో సభ్యుడిగా జస్టిస్ యు. యు. లలిత్ ఉండడం పట్ల న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వెలిబుచ్చడంతో గురువారం విచారణ ప్రారంభనికి ముందే ఆయన బెంచ్ నుండి తప్పుకున్నారు. దానితో కేసు విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయితో పాటు జస్టిస్ ఎస్ఎ బోబ్డే, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ డివై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసు విచారణ చేయాల్సి ఉండగా, గతంలో అయెధ్య కేసు విషయంలో కల్యాణ్సింగ్ తరుపున వాదించిన జస్టిస్ యుయు లలిత్ ధర్మాసనంలో ఉండటంపై న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో జస్టిస్ లలిత్ ఐదుగురు సభ్యుల బెంచ్ నుండి తప్పుకున్నారు. సుప్రీకోర్టు కొత్త ధర్మాసనం ఏర్పాటు చేయనుంది.
ఈ వివాదానికి సంబంధించి వ్యక్తిగత ధార్మిక సంస్థల నుండి 14 పిటీషన్లు దాఖలు అయి ఉన్నాయి. 1528లో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం జరగ్గా.. గుడి కూల్చేసి దానిపై మసీదు కట్టారన్నది హిందు గ్రూపుల వాదన. స్థలం ఎవరిది అన్న విషయంపై 2010 సెప్టెంబరులో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాదానికి సంబంధించి మొత్తం 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్లల్లాలకు సమానంగా పంచాలని పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 14 పిటీషన్లు దాఖలు అయ్యాయి.