న్యూఢిల్లీ: అయోధ్య వివాదం కేసులో ముస్లిం కక్షిదారుల పక్షాన వాదిస్తున్నందుకు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్కు బెదిరింపులు వచ్చాయి. దానిపై ఆయన సుప్రీంకోర్టులో ఒక కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు కూడా. తాజాగా తన గుమస్తాను కోర్టు ఆవరణలోనే కొట్టారని రాజీవ్ ధావన్ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దానితో పాటు తనకు ఫేస్బుక్లో మరో బెదిరింపు వచ్చిన విషయాన్ని కూడా ఆయన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.
ధావన్ గుమస్తాపై దాడిని ఖండిస్తున్నట్లు ధర్మాసనం కేసు విచారణ రికార్డుల్లో నమోదు చేసింది. ఇలా జరగడం తప్పని పేర్కొంటూ, ఇరు పక్షాల న్యాయవాదులూ స్వేచ్ఛగా తమ వాదనలు వినిపించే అవకాశం ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.
అంతకుముంది ధావన్ ధర్మాసనం ముందు మాట్లాడుతూ, ఇది కేసు విచారణకు తగిన వాతావరంణం కాదు. దీనిపై న్యాయమూర్తుల నుంచి ఒక్క మాట వచ్చినా చాలు. నాకు పక్షపాత వైఖరి లేదు. హిందూ మతానికి వ్యతిరేకంగా నేను వాదించను అని అన్నారు.
రామజన్మభూమి బాబరీ మసీదు వివాద స్థలం అయిన 2.77 ఎకరాల భూమిని మూడు భాగాలుగా పంచుకోవాలన్న 2010 సెప్టెంబర్ 30 అలహాబాద్ హైకోర్టు తీర్పుపై అప్పీళ్లను సుప్రీంకోర్టు రోజువారీ ప్రాతిపదికన విచారిస్తున్నది. ప్రధాన పిటిషనర్ ఎం సిద్దిఖీ, అఖిల భారత సున్నీ వక్ఫ్ బోర్డు తరపున రాజీవ్ ధావన్ వాదిస్తున్నారు.