బెంగళూరు: మన దగ్గర రూపాయి ఉన్నప్పుడు అందులో ఎంత దానం చేస్తాం? మన సంపద మొత్తంలో దాతృత్వ కార్యకలాపాలకు ఎంత వెచ్చించాలని అనుకుంటాం? సాధారణంగా అయితే మన పిల్లలు, వాళ్ల పిల్లలు, ఆ తర్వాతి తరాలకు కూడా సరిపోయేంత సంపాదించాలని చాలామంది భావిస్తారు. కానీ, అందరి దారీ ఒకటైతే.. విప్రో సంస్థల అధినేత అజీమ్ ప్రేమ్ జీ దారి మరొకటి. ఆయన దాతృత్వానికి పెట్టింది పేరు. ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో చాలా మొత్తాలు దానం చేశారు. తాజాగా ఆయన దానం చేసిన మొత్తం ఎంతో తెలిస్తే నోళ్లు వెళ్లబెడతారు. అక్షరాలా.. 52,234 కోట్ల రూపాయల మొత్తాన్ని ఆయన దానం చేశారు. అంత విలువ చేసేలా కంపెనీలో ఉన్న తన 34% షేర్లను దాతృత్వ కార్యకలాపాలకు కేటాయించారు. భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒక వ్యక్తి దానం చేయడం ఇదే ప్రథమం.
అజీమ్ ప్రేమ్ జీ నియంత్రణలో ఉన్న పలు కంపెనీలో ఆయనకు పెద్ద మొత్తంలోనే షేర్లున్నాయి. వాటిలో కొన్నింటిని అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ పేరు మీదకు బదలాయిస్తున్నట్లు ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఆయన దానం చేసిన మొత్తం రూ. 1,46,278.65 కోట్లకు చేరుకుంది. అందులో విప్రో సంస్థ యాజమాన్యంలోని 67% షేర్లు కూడా ఉన్నాయి.
అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ప్రధానంగా విద్యారంగంలో నేరుగా కృషిచేస్తోంది. అది కాక మరో 150 స్వచ్ఛంద సంస్థలకు కూడా మద్దతుగా నిలుస్తోంది. దేశంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసే సంస్థలకు గ్రాంట్లు ఇస్తుంది. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీని కూడా స్థాపించి, మానవాభివృద్ధి సంబంధిత కోర్సులు చెబుతున్నారు. అందులో డిగ్రీ కోర్సులు చెప్పడంతో పాటు పరిశోధన కూడా కొనసాగుతోంది. ప్రేమ్ జీ తప్ప మిగిలిన సంపన్న భారతీయులు మాత్రం ఇలా దానాలు చేయడానికి ముందుకొచ్చిన దాఖలాలు లేనే లేవు.