న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పటిదాకా బ్యాడ్మింటన్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సైనా.. ఇక నుంచి రాజకీయాల్లో తనదైన ముద్రవేయనున్నారు. సైనా నెహ్వాల్ బీజేపీలో చేరనున్నారనే వార్తలు క్రీడాప్రపంచంలో సంచలనం రేపాయి. గతంలో సైనా నెహ్వాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని పలుసార్లు కలిశారు. ప్రధానికి బ్యాడ్మింటన్ బ్యాట్ కూడా బహుమతిగా ఇచ్చారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సైనానెహ్వాల్ బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పాలన పట్ల ఆకర్షితురాలైన సైనా.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
హర్యానా రాష్ట్రంలో జన్మించిన సైనా.. బ్యాడ్మింటన్లో ప్రతిభ కనబర్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు పతకాలు సాధించి స్టార్ ప్లేయర్ గా ఎదిగారు. హైదరాబాద్ లో స్థిరపడిన సైనా ఇక్కడి గోపిచంద్ అకాడమీలో శిక్షణ పొందారు. ఒలంపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ లలో సైనా పతకాలు సాధించారు. సైనా భారత్ తరపున మూడుసార్లు ఒలంపిక్స్లో ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి పాల్గొన్నప్పుడు కాంస్య పతకం సాధించారు. .2009లో ప్రపంచ నెంబర్ టూ స్థానంలో కొనసాగిన సైనా… 2015లో వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్థుతం సైనా వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు. సైనా మొత్తం 24 అంతర్జాతీయ టైటిళ్లు సాధించారు. 2018లో నెహ్వాల్ తోటి క్రీడాకారుడైన హైదరాబాద్కు చెందిన పారుపల్లి కశ్యప్ను వివాహమాడారు.
కాగా, గతేడాది ప్రముఖ క్రీడాకారులు గౌతం గంభీర్, బబితా ఫొగాట్ తదితరులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సైనా నెహ్వాల్ హైదరాబాద్లో నివాసముంటున్నారు. దీంతో తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతానికి ఆమె కృషి చేసే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.